మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు! | UAE Deportation Threat Kerala CM Seeks PM Modis Urgent Intervention | Sakshi
Sakshi News home page

మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు!

Jun 8 2026 8:54 AM | Updated on Jun 8 2026 8:54 AM

UAE Deportation Threat Kerala CM Seeks PM Modis Urgent Intervention

తిరువనంతపురం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న భారతీయ హెల్త్‌కేర్ కార్మికులు, ముఖ్యంగా కేరళకు చెందిన నర్సులు, పారామెడికల్ సిబ్బంది ప్రస్తుతం ఊహించని వీసా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అక్కడ నివసిస్తున్న వేలాది మంది నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వీసా సమస్యల కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, దేశం విడిచి వెళ్లాల్సిన (డిపోర్టేషన్) పరిస్థితి తలెత్తింది. ఈ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చిత భవిష్యత్తుపై కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మానవీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక అత్యవసర లేఖ రాశారు.

ఇరాన్ ఆస్పత్రి ఉద్యోగుల ఆందోళన
ప్రాంతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ ఉద్రిక్తతల ప్రభావం దుబాయ్‌లోని ఇరానియన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కేరళ వైద్య సిబ్బందిపై పడింది. ఇక్కడి ఆంక్షల కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని సీఎం సతీశన్ లేఖలో పేర్కొన్నారు. యూఏఈ నిబంధనల ప్రకారం వీరికి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ముగిసిపోతుండటంతో, గడువులోగా వీసా హోదాను క్రమబద్ధీకరించుకోకపోతే డిపోర్టేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వారి కెరీర్‌ను దెబ్బతీయడమే కాకుండా, భవిష్యత్తులో ఉద్యోగ, ప్రొఫెషనల్ లైసెన్సింగ్ అవకాశాలను కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

కుటుంబాల భవితవ్యం ప్రమాదంలో..
ఈ అకస్మాత్తు వీసా ఇబ్బందుల వల్ల ఉపాధి వీసాలు, విజిట్ వీసాలు, డిపెండెంట్ వీసాలు పొందడం కష్టంగా మారింది. యూఏఈలో స్థిరపడిన అనేక మలయాళీ కుటుంబాలు తమ పిల్లల విద్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో అక్కడి జీవితానికి అలవాటు పడ్డాయి. ఇప్పుడు ఉద్యోగాల ముప్పు, దేశ బహిష్కరణ భయాల నేపథ్యంలో వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వం పూర్తిగా ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి వివరించారు.

మానవీయ కోణంలో జోక్యం చేసుకోవాలి
ఈ సంక్షోభానికి తగిన పరిష్కారం కనుగొనేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తక్షణమే యూఏఈలోని భారత రాయబార కార్యాలయం, అక్కడి అధికారులతో చర్చలు జరపాలని సీఎం కోరారు. కోవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లో,  అత్యవసర పరిస్థితుల్లో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన భారతీయ వైద్య సిబ్బంది సహకారాన్ని ఆయన గుర్తుచేశారు. కాబట్టి ఈ సమస్యను మానవీయ కోణంలో, న్యాయబద్ధంగా పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: మిడిల్ ఈస్ట్‌ ఉద్రిక్తతలు: గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా

Advertisement
 
Advertisement
Advertisement