బెంగళూరు: ప్రియురాలిని కిడ్నాప్ చేసి. కారులో తీసుకెళ్తున్న ప్రియుడు ఆమెను కత్తితో పొడిచి, తాను కారులోనే బాంబు పేల్చుకుని సజీవ దహనం చేసుకున్నాడు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలూకాలోని జోగిహళ్లి సమీపంలో జాతీయ రహదారి 48లో శనివారంనాడు జరిగింది. వివరాలు.. బెంగళూరులో నివసించే నాగేంద్ర (30), అక్కడే జయనగరలో నివసిస్తున్న ఉత్తరకన్నడ అంకోలా వాసి అయిన రమ్య (23)తో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఓటి టెక్నీషియన్గా పనిచేసేవారు.
అక్కడ పరిచయమయ్యారు. అతని ధోరణి నచ్చక ఆమె దూరంగా ఉంటోంది. శనివారం, తెల్లవారుజామున ఆస్పత్రిలోనే నాగేంద్ర రమ్యను కలిసి ‘వెళ్లి పెళ్లి చేసుకుందాం‘ అని చెబుతూ ఆమెతో గొడవకు దిగాడు. ఈ సమయంలో, రమ్య స్నేహితురాలు అతన్ని అడ్డుకుంది. నాతో రాకపోతే చంపేస్తానని రమ్యను బెదిరించి, ఒక ఉబర్ క్యాబ్ను బుక్ చేసి, ఉదయం సుమారు 11 గంటలకు అంకోలా వైపు వెళ్లసాగాడు.
డ్రైవర్కు పోలీసుల ఫోన్...
రమ్య స్నేహితురాలు కిడ్నాప్ గురించి పోలీసులకు తెలియజేసింది. వారు క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్కు ఫోన్ చేసి, మీ కారులో ఒక యువతిని అపహరిస్తున్నారని, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లాలని చెప్పారు. ఈ సమయంలో రమ్య, ‘అవును, నాగేంద్ర నన్ను చంపేస్తాడు, అతని దగ్గర బాంబు ఉంది, దాన్ని కారు పక్కన ఆపండి’ అని కేకలు వేసింది. ఇంతలోనే దుండగుడు ఆమె తల, చేతిపైన కత్తితో పొడిచాడు, రమ్య ప్రాణభయంతో కారు తలుపు తెరిచి కిందకు దూకింది.
కారు డ్రైవర్ ప్రవీణ్ కారును ఆపి, ఆ యువతిని కాపాడటానికి వెళ్ళాడు. కారులో ఉన్న నాగేంద్ర, కారును లాక్ చేసుకుని తన వద్దనున్న పెట్రోల్, ఇతర పేలుడువస్తువులతో కూడిన బాంబును పేల్చడంతో మంటలు ఎగసిపడ్డాయి. కారుతో పాటు అతడు సజీవ దహనమయ్యారు. కళ్లంబెల్ల పోలీసులు చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పు చేసి కారును కొని డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నానని, కళ్ల ముందే కాలిపోయిందని యజమాని ప్రవీణ్ విలపించాడు.


