న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటుతో తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మమతా బెనర్జీకి, ఇప్పుడు హస్తినలో పార్టీ అధికారిక కార్యకలాపాలు సాగించే ప్రధాన కేంద్రం కూడా చేజారిపోయింది. బారక్పూర్ ఎంపీ పార్థా భౌమిక్ తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయడమే ఇందుకు కారణమైంది. పార్టీలో తిరుగుబాటు ముదిరిన తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
చేజారిన హస్తిన నడిబొడ్డు
గత కొన్నేళ్లుగా ఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రోడ్డులో ఉన్న బంగళా నంబర్ 20 తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యాలయంగా సేవలందిస్తోంది. పార్టీ కీలక సమావేశాలు, పార్లమెంటరీ వ్యూహాలు, సమన్వయ చర్చలన్నీ ఈ ప్రాంగణం నుంచే సాగేవి. అయితే, లోక్సభ సెక్రటేరియట్ 2026చ జూన్ 9న జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఎంపీ పార్థా భౌమిక్కు హుగ్లీలో ఫ్లాట్ నంబర్ 501ను రెగ్యులర్ అధికారిక నివాసంగా కేటాయించారు. భౌమిక్ స్వయంగా కోరడం వల్లే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఆయన బంగళాను ఖాళీ చేసి ఫ్లాట్కు మారుతుండటంతో, ఇకపై ఈ ప్రాంగణాన్ని పార్టీ అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం కోల్పోయినట్లయింది.
నేతల నివాసాలే పార్టీ ఆఫీసులు
ఢిల్లీలో సొంతంగా శాశ్వత పార్టీ కార్యాలయం లేని తృణమూల్ కాంగ్రెస్, మొదటి నుంచి సీనియర్ నేతలకు కేటాయించిన ప్రభుత్వ నివాసాలనే ఆఫీసులుగా వాడుకుంటూ వస్తోంది. గతంలో జాతీయ నాయకుడు ముకుల్ రాయ్ సౌత్ ఎవెన్యూ నివాసం పార్టీకి తొలి ప్రధాన బేస్గా ఉండేది. ఆయన నిష్క్రమణ తర్వాత ఎంపీ నదీముల్ హక్తో పాటు మరికొందరు నేతల ఇళ్లను వాడుకున్నారు. చివరికి పార్థా భౌమిక్ బంగళా పార్టీ కేంద్రంగా మారింది. జాతీయ పార్టీ హోదా ఉన్న క్రమంలో శాశ్వత కార్యాలయ నిర్మాణానికి స్థల కేటాయింపు పొందే అర్హత ఉన్నప్పటికీ, టీఎంసీ మాత్రం ఎంపీల నివాసాలపైనే ఆధారపడుతూ వస్తోంది.
ముదురుతున్న తిరుగుబాటు సంక్షోభం
పార్టీలో తిరుగుబాటు పరిణామాలు మమతా బెనర్జీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారాయి. లోక్సభలో టీఎంసీకి చెందిన ఒక అసమ్మతి ఎంపీల బృందం విడిగా ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ ఆఫీసు సమస్య వచ్చి పడింది. ఒకవైపు పార్లమెంటరీ వింగ్లో తీవ్ర అనిశ్చితి, మరోవైపు ఢిల్లీలో కార్యాచరణ కేంద్రం చేజారడం పార్టీని మరింత ఆత్మరక్షణలో పడేసింది. ఈ తీవ్ర రాజకీయ తుఫానును తట్టుకుని, హస్తినలో సరికొత్త ఆపరేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు టీఎంసీ అధిష్టానానికి అత్యంత కీలకంగా మారింది.
ఇది కూడా చదవండి: ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం


