జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. యూపీ కార్మికునికి తీవ్రగాయాలు | Terrorists Target Non-Local Labourer in J&K | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. యూపీ కార్మికునికి తీవ్రగాయాలు

Oct 24 2024 11:27 AM | Updated on Oct 24 2024 11:46 AM

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈసారి పుల్వామాలో ఉగ్రవాదులు కాశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆర్మీ అధికారులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  

వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గల ట్రాల్ ప్రాంతంలో గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికునిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రీతమ్ సింగ్‌ను ఆర్మీ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత వారం రోజులుగా కశ్మీర్‌లో స్థానికేతర కార్మికులపై దాడులు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గందర్‌బాల్‌లోని శ్రీనగర్-లేహ్ హైవేపై సోనామార్గ్ సమీపంలోని గగాంగిర్ ప్రాంతంలో టన్నెల్ నిర్మిస్తున్న కంపెనీకి చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక వైద్యునితో సహా ఆరుగురు కార్మికులు మృతిచెందారు.

మరణించిన కార్మికులలో కశ్మీరీలతోపాటు కశ్మీరేతరులు ఉన్నారు. కశ్మీర్‌లో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు ఇక్కడి ప్రాజెక్టులలో  పనిచేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లకు చెందిన కార్మికులు కశ్మీర్‌లోని యాపిల్ తోటలు, పలు నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్టులలో పనులు చేస్తున్నారు.  2021లో కూడా వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ కశ్మీర్‌లో ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. 

ఇది కూడా చదవండి: బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత

Advertisement
 
Advertisement
Advertisement