మహారాష్ట్రలో దారుణం జరిగింది. మైనర్ యువతులను ట్రాఫ్ చేసి వారి అభ్యంతరకర వీడియోలు చిత్రీకరించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 19 సంవత్సరాల ఆయాన్ అహ్మద్ తన్వీర్గా తెలిపారు. నిందితుడి ఫోన్లో బాలికలకు సంబంధించిన దాదాపు 350కి పైగా అశ్లీల వీడియోలు గుర్తించినట్లు పేర్కొన్నారు.
అమరావతికి చెందిన ఆయాన్ అహ్మద్ తన్వీర్ అనే వ్యక్తి మైనర్ బాలికలే టార్గెట్గా వల పన్నాడు. మాయ మాటలతో వారిని మచ్చిక చేసుకొని వారిని నమ్మించి లైంగికంగా వేధించాడు. అనంతరం వారికి తెలియకుండా అశ్లీల వీడియోలు తీశాడు. ఆ పై ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని వారిని బెదిరిస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఈ ఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అనంతరం విచారించగా నిందితుడు సుమారు 350కి పైగా అశ్లీల వీడియోలను చిత్రీకరించినట్లు సమాచారం. వీటిలో దాదాపు 100కు పైగా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి స్థానిక నేతలు దాదాపు 180 మంది బాలికలను ఈ విధంగా వేదించాడని ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో ఇప్పటివరకూ ఎనిమిది మంది బాధితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాన నిందితుడు అయాన్ అహ్మద్తో పాటు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఉజేర్ ఖాన్ ,ఇక్బాల్ ఖాన్ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023, పోక్సో (POCSO) చట్టం మరియు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతానికి నిందితున్ని వారం రోజుల పాటు కస్టడీకి తరలించామని నిందితుడి మొబైల్ ఫోన్లో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ బృందాల సాయం కోరుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుని వల్ల మరెవరైనా బాధితులుంటే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.
అయితే ఈ ఘటన మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపింది. నిందితుడికి గతంలో రాజకీయ నేపథ్యం ఉండటంతో స్థానిక రాజకీయ నాయకులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే దృష్టిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.


