
సాక్షి, చెన్నై: తమిళనాడులో కీలక బిల్లులకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం ఆమోదం తెలిపారు. కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేస్తున్న నేపథ్యంలో బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష విధించే బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అలాగే, బయో వ్యర్థాలకు సంబంధించిన బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు.
వివరాల ప్రకారం.. తమిళనాడులో కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకట్టేందుకు స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బలవంతంగా అప్పు వసూలు చేసినా, రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నా ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు.
కాగా, బలవంతంగా అప్పు వసూలు చేసి రుణగ్రహీత బలవన్మరణానికి పాల్పడితే సదరు రుణసంస్థ బలవన్మరణానికి ప్రేరేపించినట్లు భావించేలా, బెయిల్ లభించని విధంగా జైలుశిక్ష విధించేలా బిల్లును రూపొందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం, బిల్లును గవర్నర్ ఆర్.ఎన్.రవికి పంపించగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు.
బయో మెడికల్ వ్యర్థాలను డంపింగ్ చేస్తే జైలుకే..
అదేవిధంగా, తమిళనాడులో బయోమెడికల్ వ్యర్థాలను డంప్ చేసినందుకు విచారణ లేకుండా ప్రత్యక్ష జైలు శిక్ష విధించే బిల్లును మార్చి 24న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును మాజీ న్యాయ మంత్రి రఘుపతి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 29న దీని చర్చ జరిపిన తరువాత ఆమోదించారు. అనంతరం, గవర్నర్కు పంపించడంతో.. ఈ బిల్లుకు కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా బయో మెడికల్ వ్యర్థాలను సేకరించిన లేదా పొరుగు రాష్ట్రాల నుండి తమిళనాడులో వైద్య వ్యర్థాలను డంప్ చేసిన ఎవరైనా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నియమాలను ఉల్లంఘించినట్లు పరిగణించబడతారు. దీంతో, విచారణ లేకుండానే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.