Debt collections
-
బలవంతంగా అప్పు వసూలు చేస్తే జైలుశిక్ష.. ఐదు లక్షల జరిమానా
సాక్షి, చెన్నై: తమిళనాడులో కీలక బిల్లులకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం ఆమోదం తెలిపారు. కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేస్తున్న నేపథ్యంలో బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష విధించే బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అలాగే, బయో వ్యర్థాలకు సంబంధించిన బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. వివరాల ప్రకారం.. తమిళనాడులో కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకట్టేందుకు స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బలవంతంగా అప్పు వసూలు చేసినా, రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నా ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు.కాగా, బలవంతంగా అప్పు వసూలు చేసి రుణగ్రహీత బలవన్మరణానికి పాల్పడితే సదరు రుణసంస్థ బలవన్మరణానికి ప్రేరేపించినట్లు భావించేలా, బెయిల్ లభించని విధంగా జైలుశిక్ష విధించేలా బిల్లును రూపొందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం, బిల్లును గవర్నర్ ఆర్.ఎన్.రవికి పంపించగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు.బయో మెడికల్ వ్యర్థాలను డంపింగ్ చేస్తే జైలుకే..అదేవిధంగా, తమిళనాడులో బయోమెడికల్ వ్యర్థాలను డంప్ చేసినందుకు విచారణ లేకుండా ప్రత్యక్ష జైలు శిక్ష విధించే బిల్లును మార్చి 24న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును మాజీ న్యాయ మంత్రి రఘుపతి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 29న దీని చర్చ జరిపిన తరువాత ఆమోదించారు. అనంతరం, గవర్నర్కు పంపించడంతో.. ఈ బిల్లుకు కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా బయో మెడికల్ వ్యర్థాలను సేకరించిన లేదా పొరుగు రాష్ట్రాల నుండి తమిళనాడులో వైద్య వ్యర్థాలను డంప్ చేసిన ఎవరైనా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నియమాలను ఉల్లంఘించినట్లు పరిగణించబడతారు. దీంతో, విచారణ లేకుండానే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. -
రుణ వేధింపులకు చెక్ పెడదాం..!
ఢిల్లీకి చెందిన అనుజ్ (35) వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తాను తీసుకున్న వ్యక్తిగత రుణం ఈఎంఐలను సకాలంలో చెల్లించలేకపోయాడు. దాంతో రుణ వసూళ్ల ఏజెంట్ల బృందం ఆయన ఇంటి ముందు వాలిపోయింది. నినాదాలూ చేస్తూ, ఆ దారిలో వెళ్లే ఒక్కొక్కరిని పిలిచి అనుజ్ రుణం ఎగ్గొట్టాడంటూ దు్రష్పచారం మొదలు పెట్టారు. తద్వారా అనుజ్కు పరువుపోయినట్టయింది. ఇది అనుజ్ ఒక్కడి సమస్యే అనుకుంటే పొరపాటు. ఏటా లక్షలాది మంది ఇలా రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులకు గురవుతున్నవారే. వీటిని భరించలేక బలవన్మరణానికి పాల్పడిన వారూ ఉన్నారు. రుణ గ్రహీతలకూ కొన్ని హక్కులు ఉన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రుణం చెల్లించకపోతే వసూలు చేసుకునే విషయంలోనూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు/వాటి ఏజెంట్లకూ నిర్దేశిత నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. వాటిని హద్దుమీరి వ్యవహరిస్తుంటే సహించక్కర్లేదు. అనుచిత చర్యల నుంచి రక్షణ కోరడమే కాదు, ఉపశమనం పొందొచ్చు. ఈ విషయమై సమాచారం అందించే కథనమే ఇది. గతంతో పోల్చితే నేడు రుణాలు ఎంతో సులభంగా లభిస్తున్నాయి. దీంతో రుణ ఎగవేతలు కూడా పెరిగాయి. సూక్ష్మ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల్లో ఇటీవలి కాలంలో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని వర్గాల రుణ గ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ప్రభావం బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల రుణ వసూళ్లపై ప్రభావం చూపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల పాటు వసూలు కాకుండా ఉండిపోయిన రుణాలను మొదట బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తమ రుణ రికవరీ బృందాలకు అప్పగిస్తాయి. లేదా రుణ రికవరీ ఏజెన్సీలకు అప్పగిస్తుంటాయి. ఫలితం లేకపోతే అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్సీలు) విక్రయిస్తాయి. రుణ రికవరీ ఏజెన్సీలు రుణం వసూలు చేసినందుకు ఇంత చొప్పున తీసుకుంటాయి. ఏఆర్సీలు అయితే మొండి బాకీలను తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, వాటిని వసూలు చేసుకునేందుకు చర్యలు మొదలు పెడతాయి. ఇక్కడ ఎక్కువ సందర్భాల్లో కనిపించేది.. రుణం తీసుకున్న వారిని నయానో, భయానో నానా రకాలుగా వెంటపడి, వేధించి వసూలు చేసుకోవడమే ఏజెంట్ల పని. స్పష్టమైన నిబంధనలు రుణ వసూళ్లకు రుణదాతలు కఠిన చర్యలకు పాల్పడుతున్న విషయం ఆర్బీఐ దృష్టికి రావడంతో.. రుణ రికవరీ ఏజెంట్ల నియంత్రణ విషయమై, వారి నడవడికపై లోగడే సమగ్రమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ తర్వాత పలు విడతలుగా వాటిని మెరుగుపరుస్తూ నోటిఫికేషన్లను జారీ చేసింది. రుణ గ్రహీతలకు ఉన్న హక్కులను గౌరవిస్తూనే, నైతిక విధానాల్లో వసూలుకు నిబంధనలు అమల్లో పెట్టింది. వీటి ప్రకారం.. రుణాన్ని పారదర్శకమైన విధానాల్లోనే వసూలు చేసుకోవాలి. మాటలతో లేదా చేతలతో వేధింపులకు దిగకూడదు. రుణానికి సంబంధించి, రుణ గ్రహీతకు సంబంధించి గోప్యత, గౌరవాన్ని కాపాడాలి. వారి పరువు నష్టానికి భంగం కలిగించకూడదు. బెదిరించకూడదు. రుణం చెల్లించలేదంటూ నోటీసు జారీ చేసి చట్టబద్ధమైన మార్గాల్లోనే వసూలుకు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు రుణ గ్రహీతకు కాల్స్ చేయడం కూడా ఉదయం 8 గంటల తర్వాత, రాత్రి 7గంటల్లోపేనని నిబంధలు చెబుతున్నాయి. రుణం చెల్లింపులు ఆగిపోయిన అన్ని కేసుల్లోనూ ఉద్దేశపూర్వకమని చెప్పలేం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురుకావడం వంటివి చోటు చేసుకోవచ్చు. కనుక చెల్లింపులు చేయని రుణ గ్రహీతలు అందరినీ ఒకే గాటన కట్టడాన్ని సమర్థించలేం. గుర్తింపును ధ్రువీకరించుకోవాలి..నేడు సైబర్ మోసాలు పెరిగిపోయాయి. తమకు వస్తున్న కాల్స్ అన్నీ రుణం వసూలు కోసమని భావించడానికి లేదు. అందులో సైబర్ మోసగాళ్ల కాల్స్ కూడా ఉండొచ్చు. అందుకని రుణం విషయమై వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తి బ్యాంక్ అదీకృత ఉద్యోగియేనా? లేదంటే సంబంధిత వ్యక్తికి బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ధ్రువీకరణ ఉందా? అన్నది నిర్ధారించుకోవాలి. వారి గుర్తింపు కార్డ్ను చూపించాలని కోరాలి. ఆ ఐడీ కార్డ్ మీరు రుణం తీసుకున్న బ్యాంక్ లే దా ఎన్బీఎఫ్సీ జారీ చేసిందేనా? అని పరిశీలించాలి. సరైనదని భావిస్తేనే వారితో వివరాలు పంచుకోవచ్చు. లేదంటే నేరుగా బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సిబ్బందితోనే డీల్ చేసుకుంటామని తెగేసి చెప్పేయాలి.నిబంధనలు పాటించాల్సిందే.. ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు, కోపరేటివ్ బ్యాంక్లు అన్నీ కూడా ఆర్బీఐ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాల్సిందే. ఈ విషయంలో ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, వారి ప్రవర్తనకు బ్యాంక్లే బాధ్యత వహించాలని ఆర్బీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంక్లు తమ వెబ్సైట్లలో రికవరీ ఏజెన్సీల వివరాలను వెల్లడించాలి. ఫలానా రికవరీ ఏజెంట్ లేదా ఏజెన్సీకి రుణ వసూలు బాధ్యత అప్పగించామని రుణగ్రహీతకు బ్యాంక్ ముందస్తు సమాచారం ఇవ్వాలి. బ్యాంక్ అదీకృత లేఖ, బ్యాంక్ నోటీసును ఏజెంట్లు చూపించాలి. ఒకవేళ ఏజెంట్ల నుంచి అనుచిత, అనైతక తీరును ఎదురైతే అప్పుడు రుణ గ్రహీతలు తమ హక్కులను కాపాడుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాల్స్ చేసి వేధించినట్టయితే కాల్ రికార్డులను భద్రపరుచుకోవాలి. ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల రూపంలో వేధిస్తే వాటిని సైతం జాగ్రత్త పరుచుకోవాలి. ఇంటికొచ్చి వేధిస్తుంటే వీడియో తీసి సేవ్ చేసుకోవాలి. ముందుగా సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. స్పందన లేకపోతే అప్పుడు ఆర్బీఐని ఆశ్రయించొచ్చు.ఇలా చేస్తే నయం.. → ఆర్బీఐ రిజిస్టర్డ్ సంస్థల నుంచే రుణాలను తీసుకోవాలి. ఒకవేళ సమస్య ఎదురైతే పరిష్కరించుకోవడం సులభం. → రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోవడానికి సహేతుక కారణాలను బ్యాంక్ సిబ్బందికి తెలియజేసి, తగిన సమయం కోరొచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికను సమరి్పంచొచ్చు. → రుణం తీసుకునే ముందు ఒప్పందం నిబంధనలను, తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వేధింపులపై చర్యలు → రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులు, బెదిరింపులకు సంబంధించి ఆధారాలను సేకరించాలి. వీటిని బ్యాంక్ లోన్ ఆఫీసర్ లేదా నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలి. → స్పందన లేకపోతే, వేధింపులు ఆగకపోతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. → బ్యాంక్ సేవలపై కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు దాఖలును పరిశీలించొచ్చు. → వేధింపుల నుంచి ఉపశమనం కోసం స్థానిక కోర్టులో సివిల్ వ్యాజ్యం దాఖలు చేసి ఇంజంక్షన్ ఉత్తర్వులు పొందొచ్చు. → తమ ఆందోళనలను బ్యాంక్ పట్టించుకోకపోతే అప్పుడు ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ ప్రాంతానికి ప్రత్యేక అంబుడ్స్మన్ ఉంటారు. వారి చిరునామా, కాంటాక్ట్ వివరాలను ఆర్బీఐ వెబ్సైట్ నుంచి పొందొచ్చు. → వేధింపులకు సంబంధించి ఆధారాలకు దొరకకుండా ఉండేందుకు రికవరీ ఏజెంట్లు గుర్తించడానికి వీల్లేని ఫోన్ నంబర్లు లేదా వాట్సాప్ ద్వారా సంప్రదింపులు చేసే అవకాశం లేకపోలేదు. అలా గుర్తించినట్టయితే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. → రికవరీ ఏజెంట్లు రుణ గ్రహీత కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల నంబర్లకు కాల్ చేసి బెదిరిస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఇలా చేసినా లేదా పనిచేసే కార్యాలయం, నివాస సమీపంలో సమస్యలు సృష్టించినట్టయితే వారిపై పరువునష్టం కేసు దాఖలు చేయొచ్చు. → అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించినట్టయితే కోర్టులో కేసు వేయొచ్చు. → రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులపై న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహా మేరకు సరైన చర్యలు చేపట్టొచ్చు.ఆర్బీఐ కఠిన చర్య హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై ఆర్బీఐ ఇటీవలే రూ.కోటి జరిమానా విధించింది. రికవరీ ఏజెంట్లకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో కఠినంగా వ్యవహరించింది. అది కూడా నిర్దేశించిన వేళల్లో (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటలు) కాకుండా ఇతర సమయంలో కాల్స్ చేసి రుణ గ్రహీతలను వేధించినట్టు బయటపడింది. రుణ వసూళ్లలో పేరున్న సంస్థలు సైతం ఎలా వ్యవహరిస్తున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. కఠిన చట్టాలు...సూక్ష్మ రుణ గ్రహీతల కోసం కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఓ సంచలనాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు, శిక్షలకు ఇందులో చోటు కల్పించింది. రాష్ట్రంలో రుణ వసూళ్ల ఆగడాలు పెరిగిపోవడంతో ఇలాంటి చర్యకు దిగింది. సూక్ష్మ రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఆర్బీఐ నిర్దేశించిన రుణ వసూలు నిబంధనలను ఉల్లంఘించే రుణ రికవరీ ఏజెంట్లు, ఫైనాన్స్ కంపెనీ యజమానులపై సుమోటో కేసులు నమోదు చేసేందుకు, హెల్ప్లైన్ ఏర్పాటుకు ప్రతి జిల్లా స్థాయిలో చర్యలకు ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అప్పు ప్రమాదఘంటికలివే..
డబ్బు.. మనిషిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తుంది.. పతాలానికి తోసేస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అప్పుల మూటలు కూడగట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీతం వస్తున్న వారు నిత్యం ఏదో రూపంలో అప్పులు తీసుకుంటారు. అప్పుల్లో కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి. అప్పుచేసి ఆ సొమ్మును మరింత పెంచేలా ఎక్కడైనా పెట్టుబడిపెడితే అది మంచి అప్పు. అదే అప్పు విలాసాలకు వాడితే దాన్ని చెడు అప్పు అంటారు. తీసుకునే అప్పుపై సరైన అవగాహన లేకపోతే తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి వారు తీసుకున్న అప్పుతో మరింతో లోతుల్లోకి వెళుతున్నామని తెలియకపోవచ్చు. కానీ కొన్ని సంకేతాలను గుర్తించడం ద్వారా ఈ ప్రమాదాన్ని కొంత తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వస్తువలు కొనాలంటే సరిపడా డబ్బు లేకుండా ఈజీ ఈఎంఐల బాట పడుతుంటారు. వ్యక్తిగత ఈఎంఐలు సులువే అనిపించినప్పటికీ, వీటివల్ల ఇతర ఖర్చులకు డబ్బు సరిపోదు. కిస్తీల విలువ నెలవారీ ఆదాయంలో 50శాతం కంటే తక్కువగా ఉండాలి. అనేక బ్యాంకులు వ్యక్తులు ఈ 50శాతం పరిమితి మించకుండా నిరోధించడానికి పరిమితులను కూడా విధించాయి. అయితే చాలా మంది ఈజీ ఈఎంఐలు, తగ్గింపులు, సేల్స్ ఆఫర్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చులో మునిగిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. కనీస అవసరాలను తీర్చుకోవడానికి తరచు అప్పు తీసుకుంటే మాత్రం ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి అప్పులు తీసుకోవడం వల్ల రుణఊబిలోకి కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో దాదాపు అన్ని బ్యాంకులతోపాటు ఆన్లైన్ పేమెంట్ యాప్లు సైతం క్రెడిట్ కార్డ్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే చాలా మంది తమకున్న అప్పులు తీర్చడానికి క్రెడిట్కార్డులను తీసుకుంటుంటారు. కానీ అప్పులు తీర్చడానికి తిరిగి క్రెడిట్ కార్డ్ రూపంతో అధిక వడ్డీలకు అప్పుచేయడం దారుణం. దాంతో ఆ క్రెడిట్ కార్డ్ బకాయిలను సైతం తీర్చలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. పరిస్థితి శ్రుతిమించితే తీసుకున్న అప్పులను రోల్ఓవర్ చేయాడానికి సైతం వెనుకాడరు. కానీ అలా చేస్తే భవిష్యత్తులో తిరిగి అప్పు పుట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అని గ్రహించాలి. ఇదీ చదవండి: ఆగిపోతున్న సరకు రవాణా..! అప్పు తీసుకోడదా..? అంటే తీసుకోవాలి. కానీ అది మన ఆర్థిక పరిధిలో ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవడం మంచిదే కానీ, ఈఎంఐలను లెక్కించేటప్పుడు అన్ని కనీస అవసరాలుపోను జీతం సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంతకుమించి దాదాపు ఆరు నెలలకు సరిపడే అత్యవసర నిధిను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పాస్పోర్ట్ నిబంధనల్ని మార్చండి
చెన్నై: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్న వారు దేశం విడిచి పారిపోకుండా పాస్పోర్టు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తనను విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ మంగళం అనే అంగన్వాడీ కార్యకర్త వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు పైవిధంగా స్పందించింది. ‘రుణ ఎగవేత దారులు చట్టం నుంచి తప్పించుకునేందుకు సుదూర దేశాలకు పారిపోతున్నారు. వారు తమ పాస్పోర్టులను రుణం పొందిన బ్యాంకు లేదా సంస్థ వద్ద సరెండర్ చేసేలా నిబంధనలు మార్చాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. రుణం పూర్తిగా చెల్లించేవరకు రుణదాత వద్దే పాస్పోర్టు ఉండాలి. ఉంచకపోతే పాస్పోర్టు తాత్కాలికంగా రద్దుచేయాలని, పాస్పోర్టు రెన్యూవల్కు కోర్టు అనుమతి ఉండాలని తెలిపింది. మంగళం అనే అంగన్వాడీ కార్యకర్త..అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తన బంధువు పాస్పోర్టుతో సింగపూర్ వెళ్లడంతో ప్రభుత్వం ఆమెను విధుల నుంచి తొలగించడంపై కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆమెను మందలిస్తూ వారం రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మంగళంతోపాటు ఆమె బంధువుకు రేషన్కార్డు తదితర ప్రభుత్వ సౌకర్యాలను ఉపసంహరించాలంది. -
‘రాజధాని’కోసం నిధులు సమీకరించండి
నాలుగేళ్లలో రూ.32,500 కోట్ల ప్రాజెక్టులు చేపట్టాలి: సీఎం సాక్షి, అమరావతి: రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను రుణాల రూపంలో వేగవంతంగా సమీకరించాలని అధికారులను సీఎం చంద్రబాబు కోరారు. ఇందుకోసం తక్కువ వడ్డీకి రుణాలిచ్చే అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. వచ్చే నాలుగేళ్లలో రూ.32,500 కోట్లతో మౌలిక వసతులు కల్పించాల్సిన ఉన్న నేపథ్యంలో రుణాల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన రాజధాని వ్యవహారాలపై సీఆర్డీఏ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజధానిలో పదేళ్లలో సుమారు రూ.43 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించామని, ఇందులో అధిక భాగం వచ్చే నాలుగేళ్లలో వినియోగించాల్సివుందని చెప్పారు. 2018 నాటికి ఐదు విభాగాల్లో 21 ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా దృష్టి పెట్టామని వివరించారు. ‘టాప్టెన్’ విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటయ్యేలా చూడండి.. దేశంలోని టాప్టెన్ విద్యాసంస్థలు, అంతర్జాతీయ విద్యాసంస్థలను అమరావతిలో నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. కార్పొరేట్ ఆస్పత్రులు, పరిశ్రమలు, స్టార్ హోటళ్ల ఏర్పాటుతో అమరావతి సత్వరం అభివృద్ధి చెందుతుందన్నారు. 15 ఏళ్లలో అమరావతిని మెగాసిటీగా మలచాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నిరంగాలూ వృద్ధి చెందేలా చూడాలన్నారు. కోర్ కేపిటల్లో ఉన్న భూముల్ని రాజధానికి తలమానికంగా నిలిచే సంస్థలకే కేటాయించాలన్నారు. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికోసం రూ.ఐదువేల కోట్లతో ఏపీ పట్టణాభివృద్ధి నిధి(ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్-ఏపీయూడీఎఫ్) పేరుతో ట్రస్టు ఏర్పాటుకు సీఎం చంద్రబాబుఆమోదం తెలిపారు. ఈ ట్రస్టు నిర్వహణకు ప్రత్యేకంగా ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్) పేరుతో ఒక కంపెనీని నెలకొల్పాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన సవివర నివేదికను పురపాలక శాఖాధికారులు బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎంకు అందజేశారు.