పథనంతిట్ట: శబరిమలలో అయ్యప్ప భక్తుల తాకిడి కొనసాగుతోంది. మండల పూజల నిమిత్తం ఈ నెల 16న అయ్యప్ప స్వామి సన్నిధానం ఆలయం తలుపులు తెరుచుకోగా.. వారం రోజుల్లో ఆరున్నర లక్షల మంది స్వామిని దర్శించుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు ప్రకటించారు. ఆదివారం నుంచి స్పాట్ బుకింగ్లను పెంచడంతో.. సోమవారం నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగింది. ప్రస్తుతం పంపాబేస్, శరణ్గుత్తి, నడపండల్, సన్నిధానం.. ఇలా ఎక్కడ చూసినా.. అయ్యప్ప భక్తులే కనిపిస్తున్నారు. భక్తుల శరణుఘోషలతో పంచగిరులు మార్మోగిపోతున్నాయి.
నిజానికి గత వారం కేరళ హైకోర్టు ఆదేశాలతో స్పాట్ బుకింగ్ల సంఖ్యను రోజుకు 20 వేల నుంచి 5 వేలకు కుదించారు. శనివారం ఆ నిబంధనను హైకోర్టు సడలించడంతో.. ఆదివారం నుంచి స్పాట్ బుకింగ్ల సంఖ్య పెరిగింది. రద్దీని బట్టి స్పాట్ బుకింగ్ను పెంచుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. దీంతో.. ఆదివారం నీలక్కల్, వండిపెరియార్, పంపాబేస్ వద్ద 11,516 మందికి స్పాట్ బుకింగ్ అవకాశం కల్పించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం 18 మెట్లపై నిమిషానికి సగటున 85 మంది భక్తులను అనుమతిస్తున్నట్లు వివరించారు.
శబరిమల రద్దీలో చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు వీఐ బ్యాండ్లను ఏర్పాటు చేశామని, ఇవి సత్ఫలితాలనిస్తున్నాయని పంపా పోలీస్స్టేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ బ్యాండ్లపై పిల్లలను తీసుకువచ్చిన వారి మొబైల్ నంబర్లు ఉంటాయని, క్యూఆర్ కోడ్తో చిన్నారులను క్షేమంగా తిరిగి అప్పజెబుతున్నామని తెలిపారు.


