ట్రక్కును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
మంటలు చెలరేగి ఎనిమిది మంది ప్రయాణికుల మృతి
జైపూర్: విలాసవంత స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బతుకులు తెల్లవారుజామున తెల్లారిపోయాయి. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ నుంచి బయల్దేరిన బస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరానికి వెళ్తూ మార్గమధ్యంలో రాజస్తాన్ గుండా ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురై బుగ్గిపాలైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తలకు తీవ్రమైన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
రాజస్తాన్లోని దౌసా జిల్లాలోని కోల్వా పోలీస్స్టేషన్ పరిధిలో ధనావ్డా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రయాణికులున్న ఒక ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు దాటి పక్కకు వెళ్లి మంటల్లో చిక్కుకున్నాయి. ‘‘వేగంగా ఢీకొనడంతో బస్సులోంచి నా భార్య ఎగిరిపడి ట్రక్కు, బస్సు మధ్యలో ఇరుక్కుని నా కళ్లముందు మంటల్లో కాలిపోయింది’’అని ఒకతను ఏడుస్తూ చెప్పారు. ‘‘మేం జమ్మూకశీ్మర్లో వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుని తిరిగొస్తున్నాం. ముందున్న ట్రక్కును బస్సు వేగంగా ఢీకొనడంతో మంటలొచ్చాయి. నా భర్త జాడ తెలీడంలేదు’’అని ఒకావిడ కన్నీటిపర్యంతమయ్యారు.


