
ఢిల్లీ: బీహార్లో(bihar) అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు(Lalu Prasad yadav) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్సీటీసీ కుంభకోణం కేసుకు సంబంధించి బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణీ రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్లపై(tejashwi Yadav) అభియోగాలు మోపాలని ఢిల్లీ కోర్టు(Rouse Avenue Court) సోమవారం ఆదేశించింది. అభియోగాలను నమోదు చేసింది. దీంతో కేసు విచారణ దశకు చేరుకుంది. ఈ స్కామ్లో లాలూ.. కుట్రకు పాల్పడ్డారని, తన పదవిని దుర్వినియోగం చేశారని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ కేసులో నిందితులపై అవినీతి, క్రిమినల్ కుట్ర, మోసం వంటి పలు అభియోగాలను ఖరారు చేశారు.
కాగా, ఐఆర్సీటీసీ(IRCTC Scam) కేసులో లాలూ కుటుంబంపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. పూరి, రాంచీ హోటల్స్ కాంట్రాక్టుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. ఇదంతా లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో జరిగిందని పేర్కొంది. 2017లో లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ, తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ(CBI Charge Sheet) ఆరోపణలతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏకీభవించింది. అనంతరం, ఐఆర్సీటీసీ కేసులో అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లాలూ స్పందిస్తూ.. అభియోగాలు మోపినంత మాత్రాన దోషులం కాదు. విచారణను ఎదుర్కొంటామని వెల్లడించారు.
కాగా, ఈ కేసు 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న కాలం నాటిది. రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను సుజాత హోటల్స్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. సీబీఐ చార్జిషీట్ ప్రకారం.. 2004-2014 మధ్య పూరి, రాంచీలోని బీఎన్ఆర్ హోటల్స్ను భారతీయ రైల్వేల నుంచి ఐఆర్సీటీసీకి బదిలీ చేయడంలో కుట్ర జరిగిందని, ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా నిబంధనలు మార్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ హోటల్స్ను నిర్వహణ కోసం పాట్నాలో ఉన్న సుజాత హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు లీజుకు ఇచ్చారు. నిబంధనలు మార్చడం ద్వారా సుజాత హోటల్స్కు అనుకూలంగా టెండర్ ప్రక్రియను తారుమారు చేశారని సీబీఐ ఆరోపించింది. చార్జిషీట్లో ఐఆర్సీటీసీ గ్రూప్ మాజీ జనరల్ మేనేజర్లు వీకే అస్తానా, ఆర్కే గోయల్తో పాటు, సుజాత హోటల్స్ డైరెక్టర్లు, చాణక్య హోటల్ యజమానులు విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్ల పేర్లు కూడా ఉన్నాయి.
#WATCH | Delhi: RJD leader Tejashwi Yadav leaves from the Rouse Avenue Court.
The Rouse Avenue court framed charges against former Railway Minister Lalu Prasad Yadav, former Bihar CM Rabri Devi, RJD leader Tejashwi Yadav and others in the IRCTC hotels corruption case. This case… https://t.co/F9E3EhYfJM pic.twitter.com/zpX2ecXFcC— ANI (@ANI) October 13, 2025
మరోవైపు.. బీహార్లో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో లాలూ ఫ్యామిలీపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఆర్జేడీకీ పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.