రైతులకు మద్దతుగా రిహన్నా, గ్రెటా థన్‌బర్గ్‌‌

Rihanna Tweets on Farmers Protest Kangana Ranaut Calls Her Fool - Sakshi

రైతులకు మద్దతిచ్చిన గ్రెటా థన్‌బర్గ్‌, మీనా హారిస్‌

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవం నాడు ఉద్యమం ఉద్రిక్తతంగా మారి హింస చేలరేగింది. ఇదిలా ఉండగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు రైతుల ఉద్యమానికి మద్దతునిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ రిహన్నా చేరారు. ట్విట్టర్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న రిహన్నా.. అన్నదాతలు చేస్తోన్న ఉద్యమంపై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో రైతుల ఉద్యమానికి సంబంధించని ఓ న్యూస్‌ ఆర్టికల్‌ క్లిప్‌ని షేర్‌ చేస్తూ.. మనం ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు రిహన్నా. ఇక ఈ పేపర్‌ క్లిప్‌ సీఎన్‌ఎన్‌ది కాగా.. దీనిలో గణతంత్ర దినోత్సవ వేడుకల నాడు రైతు ఉద్యమం ఉద్రిక్తంగా మారడం.. హింస చేలరేగడంతో ఢిల్లీ చుట్టుపక్కల ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారని తెలిపే కథనానికి సంబంధించింది. అలానే మయన్మార్‌లో ఆర్మీ దురగతాలను కూడా ప్రశ్నించారు రిహన్నా.
(చదవండి: 6న దేశవ్యాప్త చక్కా జామ్‌)

ఇక రిహన్నా ట్వీట్‌కు బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ రిప్లై ఇచ్చారు. ‘‘దీని గురించి ఎవరు మాట్లాడటంలేదు ఎందుకంటే వారు దేశాన్ని విభజించాలని చూస్తోన్న ఉగ్రవాదులు. వీరు దేశాన్ని విభజిస్తే.. చైనా దాన్ని స్వాధీనం చేసుకుని అమెరికా లాంటి ఓ కాలనీని తయారు చేయాలని ఎదురు చూస్తోంది. నోర్మూసుకుని కూర్చో ఫూల్‌.. మీలాంటి డమ్మీలకు మా దేశాన్ని అమ్మం’’ అంటూ కంగనా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

ఇక రైతుల ఉద్యమానికి యువ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ మద్దతు తెలిపారు. భారతదేశంలోని రైతులకు సంఘీభావం తెలుపుతున్నాము అంటూ ట్వీట్‌ చేశారు. ఇక అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్‌ మేనకోడలు మీనా హారిస్‌ కూడా రైతులకు మద్దతు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top