
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ క్షణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
ఇటీవల బెంగళూరు నుంచి లండన్ హీత్రోకు బయలుదేరిన రెండు విమానాలు(మే 16, 17వ తేదీల్లోని AI133 సర్వీస్).. గరిష్ట విమాన ప్రయాణ సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డీజీసీఏ.. ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏడు రోజుల గడువు విధించింది. అదే సమయంలో..
నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ఎయిరిండియాకు చెందిన ముగ్గురు సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఉప్రకమించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది.
‘‘నిబంధనలు పాటించకుండానే విమానాలను షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా, వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డీజీసీఏ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో.. వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజులలోపు డీజీసీఏకి నివేదించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త వారినే కొనసాగించాలని తెలిపింది.
విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన. ఐవోసీసీ అడిటింగ్లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా.
కాగా.. జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు విమానం కూలినచోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా కన్నుమూశారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరింది. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.