రైళ్లపై ఉగ్రదాడులకు స్లీపర్‌ సెల్స్‌కు ఆదేశాలు? | Rameshwaram Cafe blast planner calls for attacks on trains across India | Sakshi
Sakshi News home page

రామేశ్వరం కెఫే పేలుడు కూడా స్లీపర్‌ సెల్‌ పనే?

Aug 28 2024 1:31 PM | Updated on Aug 28 2024 1:56 PM

Rameshwaram Cafe blast planner calls for attacks on trains across India

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ భారతదేశంలోని స్లీపర్ సెల్స్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ సూచించినట్టుగా ఉన్న ఓ వీడియో రావడం కలకలం రేపుతోంది. రామేశ్వరం కేఫ్ తరహాలో ఉగ్రదాడులకు అతడు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాయి

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న జిహాదిస్ట్‌ ఘోరీ.. పాక్‌ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతుతో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో స్లీపర్ సెల్ ద్వారా పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న ఫర్హతుల్లా ఘోరిపై కొన్నేళ్లుగా భారత్‌ ఏజెన్సీల నిఘా కొనసాగుతోంది.

తాజాగా భారత్‌దేశంలోని రైళ్లపై దాడులకు సంబంధించి ఆదేశాలు ఇస్తున్న మూడు నిమిషాల వీడియో ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో రైళ్లు, పెట్రోలియం పైప్‌లైన్‌లపై దాడులు, ప్రెజర్‌ కుక్కర్లు ఉపయోగించి పేలుళ్లు, హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలంటూ ఘోరీ వ్యాఖ్యానించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఈడీ, ఎన్ఐఏ ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్‌ను వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేస్తోందని ఘోరీ వీడియోలో తెలిపాడు. తాము తిరిగొచ్చి భారత ప్రభుత్వాన్ని షేక్ చేస్తామని వీడియోలో ఘోరీ వెల్లడించాడు. ఈ పరిణామాల వేళ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యయి.

ఘోరీ భారతదేశంలోని పెట్రోలియం పైప్‌లైన్‌లను మరియు హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికల గురించి కూడా మాట్లాడాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్‌లను వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేస్తోందని ఆయన అన్నారు.

కాగా ఫర్హతుల్లా ఘోరీకి అబూ సుఫియాన్, సర్దార్ సాహబ్, ఫరూ అనే పేర్లు కూడా ఉన్నాయి. భారత్‌లో గతంలో చోటు చేసుకున్న అనేక పేలుళ్ల వెనుక ఘోరీ హస్తం ఉంది. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుళ్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 10 మంది వరకూ గాయపడ్డారు.

ఇక 2002లో గుజరాత్‌లోని అక్షరథామ్ దేవాలయంపై జరిగిన దాడిలో 30 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. 2005లో హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక కూడా అతడి హస్తమే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement