ఇతను ఎవరు? సీజేపీ ర్యాలీలో ఇంతగా వైరల్‌ అయ్యాడేంటి? | Who is Nakul Dhull Meet the content creator | Sakshi
Sakshi News home page

ఇతను ఎవరు? సీజేపీ ర్యాలీలో ఇంతగా వైరల్‌ అయ్యాడేంటి?

Jul 23 2026 3:10 PM | Updated on Jul 23 2026 4:56 PM

  Who is Nakul Dhull Meet the content creator

న్యూఢిల్లీ: జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థుల నిరసనలకు చెందిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ సమయంలో వార్తల్లో నిలిచిన వారిలో ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ నకుల్ ధుల్ ఒకరు. నిరసన స్థలం నుంచి ఆయన విడుదల చేసిన భావోద్వేగ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో 'చలో సంసద్' ర్యాలీ సమయంలో పోలీసుల చర్యలో తనతో పాటు తన స్నేహితులపై దాడి జరిగిందని నకుల్ ఆరోపించారు.

నకుల్ ధుల్ ఎవరు?
నకుల్ ధుల్ ఢిల్లీకి చెందిన డిజిటల్ క్రియేటర్. సామాజిక అంశాలు, విద్య, యువత సమస్యలు, సమకాలీన పరిణామాలపై వీడియోలు రూపొందిస్తుంటారు. ప్రజా విధానాలు, విద్యా అంశాలు, పౌర సమస్యలపై అభిప్రాయాలు, లైవ్‌ రిపోర్టింగ్‌, వ్యక్తిగత అనుభవాలు పంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన వీడియోలు ఎక్కువగా ప్రజా విధానాలు, విద్య, పౌర అంశాలపై ఉంటాయి. సామాజిక, రాజకీయ పరిణామాలను దగ్గరగా గమనించే ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు.

ఎందుకు ట్రెండింగ్‌లో ఉన్నారు?
ఇటీవల ఢిల్లీలో జరిగిన 'చలో సంసద్' నిరసన నుంచి నకుల్ ఒక వీడియో షేర్‌ చేయడంతో ఆయన ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఆ వీడియోలో.. పార్లమెంట్ వైపు సాగిన నిరసనలో పోలీసులు తీసుకుంటున్న చర్యలో భాగంగా తనతో పాటు తన స్నేహితులను కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది. చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నకుల్ చేసిన ఆరోపణలకు స్వతంత్రంగా ధ్రువీకరణ జరగలేదు. ఆయన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, నిరసనకారులు హెచ్చరికలను పట్టించుకోకుండా నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని, దూకుడుగా వ్యవహరించారని, అందువల్ల వారిని చెదరగొట్టే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

నటి అయేషా ఖాన్‌కు ఏమైంది?
నిరసనలో పాల్గొనకముందే, నినాదాలు చేయకముందే నటి, మోడల్, కంటెంట్ క్రియేటర్‌ అయేషా ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను సాయంత్రం 4 గంటలకు తన స్నేహితులతో కలిసి నిరసన స్థలానికి చేరుకున్నానని ఆ నటి తెలిపారు. తాను మాట్లాడకముందే, నిరసనలో పాల్గొనకముందే, ఆ ప్రాంతంలో నిరసన చేయడానికి అనుమతి లేదని ఓ పోలీసు అధికారి చెప్పారని ఆమె ఆరోపించారు.

"బతా దిజియే దూస్రా ఔర్ క్యా రాస్తా హైం? (దయచేసి మరో మార్గం ఏమిటో చెప్పండి?)" అని ప్రశ్నించానని అయేషా తెలిపారు. సమాధానం చెప్పే బదులు పోలీసులు తనను, తన స్నేహితులను పోలీసు వాహనంలోకి ఎక్కాలని కోరారని ఆమె ఆరోపించారు.

కాగా, విద్యా రంగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, జవాబుదారీతనం, విద్యా సంస్కరణల డిమాండ్లతో ఈ నిరసనలు మొదలయ్యాయి.

ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకత్వం వహిస్తోంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ వైపు ర్యాలీ జరిగిన సమయంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి దూకుడుగా వ్యవహరించారని ఢిల్లీ పోలీసులు చెబుతుండగా, లాఠీచార్జి, టియర్ గ్యాస్ వాడారని నిరసనకారులు ఆరోపించారు.

గత కొన్ని రోజులుగా షబానా ఆజ్మీ, వేదాంగ్ రైనా, అనుపమ్ ఖేర్, ప్రకాశ్ రాజ్ సహా పలువురు ప్రముఖులు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. మంగళవారం నిరసనకారులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసినా ఉద్యమం కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement