ఢిల్లీ: సీజేపీ నిరసనల్లో 118 మంది పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సంచలన ట్వీట్ చేశారు. తమ సిబ్బందిపై జరిగిన దాడులను ఖండిస్తూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు కూడా తమ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో బాధను అనుభవిస్తారని చెబుతూ.. పోలీసు వ్యవస్థలోని మానవీయ కోణాన్ని ఎక్స్ వేదికగా ఢిల్లీ పోలీసులు ఎత్తిచూపారు.
‘‘యూనిఫాం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి నొప్పి తక్కువగా అనిపించదు. ప్రతి బ్యాడ్జ్ వెనుక స్పందించే గుండె.. ఒక కుటుంబం, సేవ చేస్తామనే హామీ ఉంటాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి జరగడం తీవ్రంగా కలిచివేస్తోంది. అభిప్రాయ భేదాలుంటే గళం వినిపించొచ్చు కానీ.. హింసకు మాత్రం చోటు ఉండకూడదన్న ఢిల్లీ పోలీసుల పోస్ట్.. వైరల్గా మారింది.
సీజేపీ ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్మంతర్కు తరలివస్తున్నారు. బుధవారం సాయంత్రం అక్కడ ఉన్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జై ప్రకాశ్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘర్షణల అనంతరం ఢిల్లీ పోలీసులకు, సీజేపీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
హింసను రెచ్చగొట్టారని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిరసనకారులు రాళ్ళు రువ్వడం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో సీనియర్ అధికారులతో సహా 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఏసీపీ (పంజాబీ బాగ్) జై ప్రకాష్, ఏసీపీ (కన్నాట్ ప్లేస్) వివేక్ భగత్, ఇన్స్పెక్టర్ నంద్ కిషోర్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.


