గాడ్జిల్లా ఎల్‌ నినో భయపెట్టింది.. మరి ఈ మేఘాలు ఎలా వచ్చాయి? | Godzilla El Nino Threatened India But Monsoon Scene Reversed, Here's Why? | Sakshi
Sakshi News home page

గాడ్జిల్లా ఎల్‌ నినో భయపెట్టింది.. మరి ఈ మేఘాలు ఎలా వచ్చాయి?

Jul 23 2026 7:12 AM | Updated on Jul 23 2026 10:35 AM

Godzilla El Nino Threatened India But Monsoon Scene Reversed, Here's Why?

ఈ ఏడాది ఎల్‌ నినో ప్రభావం భారత రుతుపవనాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. బలమైన ఎల్‌ నినో భారత్‌లో వర్షాలను తగ్గిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు 95 శాతం ప్రాంతం మేఘాలతో కప్పుకుపోయింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగుతుందని తేల్చేశారు. మరి ఎల్‌ నినో ఉన్నా ఈ మేఘాలు, వర్షాలు ఎందుకు వస్తున్నాయి?

ఎల్‌ నినో అనేది పసిఫిక్‌ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. భారత రుతుపవనాల విషయంలో ఎల్‌ నినో సాధారణంగా వర్షాలకు ప్రతికూలంగా పనిచేస్తుంది. అయితే ఇది ప్రతిరోజు వాతావరణాన్ని నియంత్రించదు. ఒక వారం లేదా కొన్ని రోజుల వర్షాలను ఆపే శక్తి దీనికి ఉండదు. మొత్తం రుతుపవనాల కాలంలో వర్షపాతం ఎలా ఉండొచ్చనే అంచనాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది.

స్థానిక వాతావరణ పరిస్థితులే కారణం
ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండటానికి స్థానిక వాతావరణ పరిస్థితులే కారణమని నిపుణులు చెబుతున్నారు. హర్యానా, ఈశాన్య మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు తేమతో కూడిన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రెండు సముద్రాల నుంచి భారీగా తేమ దేశ భూభాగంలోకి చేరుతోంది. ఈ తేమ, గాలి కలయికతో మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్‌నినో ఈ స్థానిక పరిస్థితులను పూర్తిగా అడ్డుకోలేకపోతోంది.

మళ్లీ పుంజుకున్న రుతుపవనాలు
ఇటీవల కొంతకాలం ఉత్తర దిశగా వెళ్లిన రుతుపవన ద్రోణి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. బంగాళాఖాతం నుంచి తేమ సరఫరా పెరగడంతో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ ప్రభావం ఎంత?
భారత వర్షాలను ప్రభావితం చేసే మరో కీలక అంశం ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ (IOD). ఇది హిందూ మహాసముద్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల సముద్ర ఉష్ణోగ్రతల తేడాలను సూచిస్తుంది. పాజిటివ్‌ IOD ఉన్నప్పుడు భారత్‌వైపు అదనపు తేమను తీసుకురావడంలో సహకరిస్తుంది. 1997లో బలమైన ఎల్‌ నినో ఉన్నప్పటికీ పాజిటివ్‌ IOD భారత్‌ను కరువు నుంచి కాపాడింది. అయితే ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలో ఉంది. దీంతో ఎల్‌ నినో ప్రభావాన్ని అడ్డుకునే బలమైన సహకారం అందడం లేదు.

మరి వర్షాల లోటు ముగిసినట్టేనా?
ప్రస్తుతం దేశమంతా మేఘాలతో కప్పుకున్నా.. రుతుపవనాలపై ఎల్‌ నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయినట్లు భావించలేమని నిపుణులు చెబుతున్నారు. ఒకటి రెండు వారాల వర్షాలు మొత్తం సీజన్‌ పరిస్థితిని నిర్ణయించవు. కొన్ని రోజుల పాటు సాధారణ వాతావరణ వ్యవస్థలు బలమైన ఎల్‌ నినో ప్రభావాన్ని అధిగమించగలవు. అయితే రుతుపవనాల మొత్తం గమనాన్ని తెలుసుకోవాలంటే రాబోయే నెలల్లో వర్షపాతం ఎలా ఉంటుందన్నదే కీలకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement