ఢిల్లీ హోటల్‌ ఘటన: సిలిండర్‌ పేలుడు కాదంట! | Police Suspects Delhi hotel fire caused by This Angle | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హోటల్‌ ఘటన: సిలిండర్‌ పేలుడు కాదంట!

Jun 4 2026 12:18 PM | Updated on Jun 4 2026 12:39 PM

Police Suspects Delhi hotel fire caused by This Angle

ప్రమాదం తర్వాత రెస్టారెంట్‌.. ఇన్‌సెట్‌లో అరెస్టైన ఓనర్‌

ఢిల్లీ: మాలవీయా నగర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై.. ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. అగ్ని ప్రమాదానికి సిలిండర్‌ బ్లాస్ట్‌ కారణం కాదని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోరం జరిగి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.

మొదట్లో ఈ అగ్ని ప్రమాదం ఎల్‌పీజీ సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా? అనుమానం వ్యక్తమైంది. కానీ దర్యాప్తు బృందాలు ఆ కోణాన్ని ప్రస్తుతం పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత సిలిండర్ పేలుడు జరిగినట్లు సూచించే ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో గ్యాస్ ఎక్స్‌ప్లోషన్ కారణమన్న వాదన బలహీనపడింది.

దర్యాప్తులో బయటపడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. హోటల్‌లో రెండు వేర్వేరు కిచెన్లు ఉండటం. వాటిలో ఒకటి భవనం బేస్‌మెంట్‌లో ఉండగా, మరొకటి పై అంతస్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కిచెన్లలోనూ అనేక ఎల్‌పీజీ సిలిండర్లు నిల్వ ఉన్నప్పటికీ, అవి ఏదీ పేలిన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని ప్రాథమిక తనిఖీల్లో తేలింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో మంటలు ఎలా ప్రారంభమయ్యాయి, ఏ ఎలక్ట్రికల్ పాయింట్ నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న అంశాలపై దర్యాప్తు బృందాలు మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బ్రేక్‌ఫాస్ట్‌ కోసం వంటమనిషి(చెఫ్‌) ఎలక్ట్రిక్ స్టవ్ వినియోగ సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కోణమే ప్రధాన అనుమానంగా కొనసాగుతోంది. అయితే, ఇది తుది నిర్ధారణ కాదని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత రానుందని అధికారులు పేర్కొంటున్నారు.

దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌ హౌజ్‌రాణి ప్రాంతంలో ఉన్న ఫ్లరిష్‌ స్టే బెడ్‌ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ హోటల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. బుధవారం ఉదయం 8.50 గంటల సమయంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో భవనం అంతటా వ్యాపించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు ఆఫ్రికా, తుర్క్‌మెనిస్థాన్‌కు చెందిన విదేశీయులు కూడా ఉన్నారు. గురుగ్రావ్‌కు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు మరణించారు. మరో 35 మంది గాయపడగా, వారిలో 19 మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. 

భవనంలో ఒకే ఎగ్జిట్ ఉండటం, అనుమతులకు మించి గదులు నిర్వహించడం, బేస్‌మెంట్‌తో సహా అనధికార నిర్మాణాలు ఉండటం వల్ల ఎక్కువ మంది బయటపడలేకపోయారని అధికారులు చెబుతున్నారు. కొందరు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా, ఒక మహిళ తన చిన్నారితో సహా మూడో అంతస్తు నుంచి దూకిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ హోటల్ ప్రభుత్వ B&B పథకం కింద నడుస్తుండగా, కేవలం ఆరు గదుల అనుమతి ఉన్నా 25 గదుల వరకు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న హోటల్‌ యాజమానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేయగలిగారు. ప్రమాద సమయంలో తాను అక్కడే ఉన్నానని.. భయంతో పారిపోయానని చెబుతున్నాడతను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement