భారత్తో ఏకేడీఎన్ భాగస్వామ్యంపై చర్చలు
న్యూఢిల్లీ: ఇస్మాయిలీ ముస్లింల 50వ ఇమామ్ ప్రిన్స్ రహీం ఆగా ఖాన్–5 గురువారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్(ఏకేడీఎన్)తో భారత్ భాగస్వామ్యంపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని మోదీ ఎక్స్లో.. ప్రిన్స్ రహీం ఆగా ఖాన్ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన తండ్రి, దివంగత ఆగా ఖాన్–4 జ్ఞాపకాలను, భారత్ అభివృద్ధి కోసం ఆయన అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నాం.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారిత వంటి రంగాల్లో ఏకేడీఎన్తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు గల మార్గాలపై చర్చించాం’అని పేర్కొన్నారు. భారత్ సమ్మిళిత వృద్ధి, సామాజిక పురోగతికి ఏకేడీఎన్ కట్టుబడి ఉందని ఆగా ఖాన్ పునరుద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానంపై పర్యటనకు వచ్చిన ఆగాఖాన్ ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు భారత్లో ఉంటారు. ఏకేడీఎన్ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను ఆగా ఖాన్ సందర్శించనున్నారు. ఇస్మాయిలీ వర్గం 50వ ఇమామ్గా గతేడాది బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి.


