breaking news
Aga khan
-
ప్రధాని మోదీతో ప్రిన్స్ ఆగా ఖాన్ భేటీ
న్యూఢిల్లీ: ఇస్మాయిలీ ముస్లింల 50వ ఇమామ్ ప్రిన్స్ రహీం ఆగా ఖాన్–5 గురువారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్(ఏకేడీఎన్)తో భారత్ భాగస్వామ్యంపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని మోదీ ఎక్స్లో.. ప్రిన్స్ రహీం ఆగా ఖాన్ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన తండ్రి, దివంగత ఆగా ఖాన్–4 జ్ఞాపకాలను, భారత్ అభివృద్ధి కోసం ఆయన అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నాం. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారిత వంటి రంగాల్లో ఏకేడీఎన్తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు గల మార్గాలపై చర్చించాం’అని పేర్కొన్నారు. భారత్ సమ్మిళిత వృద్ధి, సామాజిక పురోగతికి ఏకేడీఎన్ కట్టుబడి ఉందని ఆగా ఖాన్ పునరుద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానంపై పర్యటనకు వచ్చిన ఆగాఖాన్ ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు భారత్లో ఉంటారు. ఏకేడీఎన్ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను ఆగా ఖాన్ సందర్శించనున్నారు. ఇస్మాయిలీ వర్గం 50వ ఇమామ్గా గతేడాది బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. -
ఆగాఖాన్ అస్తమయం
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ‘ఇస్మాయిలీ’ వర్గం ముస్లింల ఆధ్యాత్మిక గురువు, వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ఆగాఖాన్ కన్నుమూశారు. షియా ఇస్మాయిలీ ముస్లింల 48వ ఇమామ్ హోదాను యుక్తవయసులో వారసత్వంగా పొంది దశాబ్దాలపాటు వేల కోట్ల రూపాయల దాతృత్వ కార్యక్రమాలు చేసి గొప్ప వితరణశీలిగా పేరు తెచ్చుకున్నారు. ఆగాఖాన్ పోర్చుగల్లో మంగళవారం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబం బుధవారం ప్రకటించింది. ఆగా ఖాన్ అంత్యక్రియలు పోర్చుగల్ రాజధాని నగరం లిస్బన్లో జరుగుతాయని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్, ఇస్మాయిలీ రిలీజియన్ కమ్యూనిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగాఖాన్కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొహమ్మద్ ప్రవక్త వారసులుగా షియా ముస్లింలలో ఉప వర్గమైన ఇస్మాయిలీ వర్గానికి ఆగాఖాన్ కుటుంబం ఆధ్యాత్మిక గురువులుగా శతాబ్దాలుగా కొనసాగుతోంది. 1936 డిసెంబర్ 13న స్విట్జర్లాండ్లోని జెనీవాలో జన్మించిన ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీమ్ అల్ హుస్సేనీ. ఆగాఖాన్ తండ్రి ప్రిన్స్ అలీఖాన్ విలాస పురుషుడు. దీంతో అలీఖాన్ను కాదని తాత సర్ సుల్తాన్ మొహ మ్మద్ షా (ఆగాఖాన్– 3).. కరీమ్ అల్ హు స్సేనీను డిగ్రీ స్టూడెంట్గా ఉన్నప్పుడే ఆగా ఖాన్–4గా 1957 అక్టోబర్ 19వ తేదీన ప్రకటించారు. టాంజాని యాలోని దారెస్స లామ్లో ఈ కార్య క్రమం జరిగింది. గతంలో ఇదే దారెస్సలామ్ వేదికగా ఆగాఖాన్–3ను ఇస్మాయిలీ వర్గీయులు ఆయనంత బరువు వజ్రాలను కానుకగా సమర్పించిన వార్త అప్పట్లో సంచలనమైంది. ఆనాటి నుంచి ఆధ్యాత్మిక గురువుగా కొనసాగుతూనే వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. వీళ్ల ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పలు ప్రపంచ దేశాల్లో వందలాది ఆస్పత్రులు సేవలందిస్తున్నాయి. ఏటా ఒక బిలియన్ డాలర్ల మేర లాభాపేక్షలేని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆగా ఖాన్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు ప్రపంచదేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మరోవైపు ఇస్మాయిలీ ముస్లింల నూతన ఆధ్యాత్మిక గురువుగా ఆగాఖాన్4 కుమారుడు రహీమ్ అల్ హుస్సేనీ పేరును ప్రకటించారు. 50వ గురువుగా ఈయనను ఇకపై ఆగాఖాన్–5గా పిలవనున్నారు. -
Aga Khan : ఆధ్యాత్మిక నేత, ప్రముఖ దాత ఆగా ఖాన్ కన్నుమూత
బిలియనీర్,ప్రపంచ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ ఆగాఖాన్ (88) (Aga Khan) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ ఫౌండేషన్ ధృవీకరించింది. పోర్చుగల్లోని లిస్బన్లో తుదిశ్వాస విడిచారని ఆగాఖాన్ ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. ఆగాఖాన్మృతిపై విచారాన్ని ప్రకటించిన షౌండేషన్, ఆయన కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలిపింది. ప్రపంచంలోని వ్యక్తులంతా మతపరమైన భేదాలు లేకుండా ఆయన కోరుకున్నట్లుగా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని తెలిపింది.His Highness Prince Karim Al-Hussaini, Aga Khan IV, 49th hereditary Imam of the Shia Ismaili Muslims and direct descendant of the Prophet Muhammad (peace be upon him), passed away peacefully in Lisbon on 4 February 2025, aged 88, surrounded by his family. Prince Karim Aga Khan… pic.twitter.com/bxOyR0TyZr— Aga Khan Development Network (@akdn) February 4, 2025ఆగా ఖాన్కు హైదరాబాద్తో చారిత్రక సంబంధం కూడా ఉంది. అతని పూర్వీకులు ఈ ప్రాంతంలో వాణిజ్యం ,దాతృత్వం సేవలను అందించారు. ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ (AKDN) ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో AKDN పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి శిక్షణా కేంద్రాలతో సహా అనేక విద్యా సంస్థలను స్థాపించింది. 1967లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ను స్థాపించారు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వందిలాది ఆసుపత్రులు ,విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేయడంతోపాటు అనేక ఇతర సేవా కార్యక్రమాలకు తన సంపదను వెచ్చించారు. ఈ సేవలకు గాను 2015లో దేశీయ అతిపెద్ద పౌరపురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు. ప్రిన్స్ కరీం అల్-హుస్సేనీ అగా ఖాన్ IV అని పిలుచుకునే ఆగా ఖాన్ స్విట్జర్లాండ్లో జన్మించారు. ప్రస్తుతం బ్రిటన్ పౌరుడిగా ఉన్నారు. 1957లో తన 20 ఏండ్ల వయస్సులో ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్గా నియమితులయ్యారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతోపాటు అనేక ఇతర వ్యాపారాల్లో రాణించారు. యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో నిర్వహించే గుర్రాల రేసుల్లో ఆయన పాల్గొన్నారు. షేర్గర్ జాతికి చెందిన గుర్రంతో రేసుల్లో పాల్గొనేవారు. 1969లో బేగం సమ్లిమా అగా ఖాన్ను వివాహం చేసుకున్నారు. తరువాత 1998లో బేగం ఇనారా అగా ఖాన్ను రెండో వివాహం చేసుకున్నారు ఆగాఖాన్ ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆగాఖాన్ మృతిపట్ల కింగ్ చార్లెస్ 3 సంతాపం ప్రకటించారు. -
హైదరాబాద్ అకాడమీని సందర్శించిన అగాఖాన్
ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు, 'పద్మవిభూషణ్' అగాఖాన్ శుక్రవారం హైదరాబాద్ లోని అగాఖాన్ అకాడమీని సందర్శించారు.పద్మ పురస్కారం స్వీకరించేందుకు భారత్ వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ సమీపంలోని అగాఖాన్ అకాడమీకి వచ్చారు. షియా ఇస్లామ్కు సంబంధించిన నిజారి ఇస్లామిజమ్కు 49వ ఇమామ్గా వ్యహరిస్తున్న అగాఖాన్ దాదాపు రెండేళ్ల తర్వాత హైదరాబాద్ రావడంతో అకాడమీ ప్రతినిధులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనలో పలువురు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఉత్తమ ఐడియాతో ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులను అగాఖాన్ అభినందించారు. అగాఖాన్.. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాటిలో హోటళ్ల వ్యాపారం ప్రధానమైనది. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం 80 కోట్ల డాలర్ల సంపద కలిగిన ఆయన.. ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియాల్లో విద్యావ్యాప్తితోపాటు ధార్మిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలో దాదాపు 100 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన అగాఖాన్ అకాడమీలో మత, ప్రాంతీయ బేధాలకు తావులేంకుడా వందలాదిమంది విద్యార్థులకు బోధనతోపాటు వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. -
మళ్లీ బడికి వెళ్లాలనిపిస్తోంది.. : కిరణ్కుమార్రెడ్డి
ఆగాఖాన్ అకాడమీ ప్రారంభోత్సవంలో సీఎం కిరణ్ సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా... అక్కడ చదువుకున్న తర్వాత పాఠశాలకు తిరిగి వెళ్లలేదు. ఈ రోజు ఆగాఖాన్ అకాడమీని చూస్తుంటే.. మళ్లీ స్కూల్కు వెళ్లాలనిపిస్తోంది..అలాంటి వాతావరణం ఇక్కడ ఉంది’ అని సీఎం కిరణ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల సమీపంలో ఆగాఖాన్ అకాడ మీని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. విద్య పరంగా అభివృద్ధి చెందితేనే ప్రతి రంగం ముందుకెళ్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలు ఇక్కడున్నాయన్నారు. వీటి జతకు ఆగాఖాన్ అకాడమీ చేరడం శుభపరిణామమన్నారు. అనంతరం ప్రిన్స్ ఆగాఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ విద్యాసంస్థ ఏర్పాటుకు స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన మూడేళ్లలో 230 మిలియన్ల పిల్లలను పాఠశాలల్లో చేర్పించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పల్లంరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, అకాడమీ డెరైక్టర్ సలీంభాటియా, కలెక్టర్ బి. శ్రీధర్ పాల్గొన్నారు.


