127 ఏళ్ల తర్వాత భారత్‌కు బుద్ధుని అవశేషాలు | PM Narendra Modi announced Buddha relics returned to India after 127 years | Sakshi
Sakshi News home page

127 ఏళ్ల తర్వాత భారత్‌కు బుద్ధుని అవశేషాలు

Jul 31 2025 4:50 AM | Updated on Jul 31 2025 4:50 AM

PM Narendra Modi announced Buddha relics returned to India after 127 years

దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజుగా మోదీ అభివర్ణన

న్యూఢిల్లీ: బ్రిటిష్‌ హయాంలో భారత్‌ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ఈ వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన సామాజికమాధ్యమ ఖాతా ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. శతాబ్దం తర్వాత బుద్ధుని అవశేషాలు భారత్‌కు తిరిగి రావడం నిజంగా దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజు అని ప్రధాని మోదీ అభివర్ణించారు. 

1898 సంవత్సరంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిప్రాహ్వా ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు ముమ్మరంగా జరిగాయి. ఆ తవ్వకాల్లో బుద్ధుని పవిత్ర అవశేషాలు బయల్పడ్డాయి. అయితే నాటి బ్రిటన్‌పాలకులు భారత్‌ నుంచి ఈ అవశేషాలను యూకేకు తరలించారు.

 ‘‘ గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు ఏకంగా 127 సంవత్సరాల అనంతరం మళ్లీ స్వదేశమైన భారత్‌కు తీసుకురావడం దేశ ప్రజలందరికీ ఎంతో గర్వకా రణం. బుద్ధుడు, ఆయన బోధనలతో భారత దేశానికి ఉన్న అనుబంధాన్ని ఈ పవిత్ర అవశేషా లు మరోసారి చాటిచెబుతున్నాయి’’ అని ‘ఎక్స్‌’ లో ప్రధాని మోదీ పోస్ట్‌పెట్టారు.

 ‘‘ మహా ద్భుతమైన ఘన వారసత్వం, సంస్కృతిని పరిరక్షించడంలో మన నిబద్ధతను ఈ అవశేషాలు చాటుతున్నాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ అవశేషాలు ఈ ఏడాది ప్రారంభంలో ఓ అంతర్జాతీయ సంస్థ చేపట్టిన వేలంపాటలో తొలి సారిగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో వీటిని ఎలా గైనా తిరిగి భారత్‌కు రప్పించేందుకు మా ప్రభు త్వం నడుం బిగించింది. ఈ మేరకు కృషిచేసిన వా రందరికీ నా అభినందనలు’’ అని మోదీ అన్నారు.

నాటి పేటికలో బంగారు రత్నాభరణాలు
 piprahwa. com వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం నేపాల్‌ సరిహద్దులోని పిప్రాహ్వా బౌద్దమతానికి సంబంధించిన పురాతన స్తూపం ఉంది. అక్కడ నాటి బ్రిటన్‌ పాలకులు తవ్వకాలు జరిపారు. దాంతో అక్కడ భూగర్భంలో పెద్ద రాతిపెట్టెలో కొన్ని అవశేషాలు బయల్పపడ్డాయి. ఇందులో బుద్ధునికి సంబంధించినవిగా భావిస్తున్న అస్థి అవశేషాలు, సున్నపురాయి పేటిక, బంగారు ఆభరణాలు, రత్నాల వంటివి ఉన్నాయి. 

బుద్ధుని నిర్యాణం తర్వాత బుద్దుని అవశేషాలను ఆనాటి రాజ్యాల రాజులకు పంపిణీ చేసేందుకు అవశేషాలను కొన్ని భాగాలుగా విభజించారు. అందులో కొంతభాగాన్ని నేడు థాయ్‌లాండ్‌గా పిలుస్తున్న సియామ్‌ ప్రాంతంలోని రాజుకు అందజేశారు. ఆనాడు తవ్వకాల్లో బయల్పడిన సున్నపురాయి మృతపేటిక ప్రస్తుతం కోల్‌కతాలోని ఇండియన్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం ఈ పిప్రాహ్వా గ్రామం ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఉంది. ఇది బుద్ధుడు జన్మించిన లుంబినీ వనానికి కేవలం 9 మైళ్ల దూరంలో ఉంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement