
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాని మోదీ ఈసారి కూడా తన యోగాసనాల ఏఐ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిలో శశాంకాసనం వేసే విధానాన్ని వివరించారు.
ఈ వీడియోను సంస్కృత భాషలో రూపొందించారు. శశాంకాసనం వేసేటప్పుడు శరీరం కుందేలు మాదిరి పొజీషన్లోకి వస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ దూరమవుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలో వీడియోలో చూపించారు. ఈ ఆసనం వేయడానికి ముందుగా వ్రజాసన భంగిమలో కూర్చోవాలి. మోకాళ్లపై చేతులను ఉంచాలి. ఇప్పుడు రెండు మోకాళ్లను వీలైనంత వరకు సౌకర్యవంతమైన భంగిమలో విస్తరించాలి. అరచేతులను మోకాళ్ల మధ్య ఉంచాలి. వాటిని ముందుకు చాస్తూ, శరీరాన్ని కిందకు వంచాలి. అప్పుడు చేతులు సమాంతరంగా ముందుకు చాచాలి. అదే పొజీషన్లో ముందుకు చూస్తూ కొంత సమయం పాటు ఈ భంగిమలో ఉండాలి. తరువాత వ్రజాసన భంగిమకు రావాలి.
మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఈ ఆసనం వేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే కోపం అదుపులోకి వస్తుంది. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్తో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నవారు కూడా ఈ ఆసనం వేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి. హైబీపీ ఉన్నవారు ఈ ఆసనం వేసే విషయమై వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Here is why you must practice Shashankasana regularly… pic.twitter.com/95kwzrKYTD
— Narendra Modi (@narendramodi) June 19, 2024