‘డోక్లాం’పై భూటాన్‌తో టచ్‌లో ఉన్నాం  | PM Modi holds talks with Bhutan King | Sakshi
Sakshi News home page

‘డోక్లాం’పై భూటాన్‌తో టచ్‌లో ఉన్నాం 

Apr 5 2023 2:56 AM | Updated on Apr 5 2023 2:56 AM

PM Modi holds talks with Bhutan King - Sakshi

న్యూఢిల్లీ: డోక్లాం అంశానికి సంబంధించి భూటాన్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా తెలిపారు. రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగెల్‌ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు ద్వైపాక్షిక అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఐదుసూత్రాల రోడ్‌మ్యాప్‌ను వాంగ్‌చుక్‌ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. భేటీ వివరాలను క్వాట్రా మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా డోక్లాంపై ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. భద్రతకు సంబందించిన అన్ని అంశాల్లోనూ ఇరు దేశాలు పరస్పరం సహకారం ఇచ్చి పుచ్చుకుంటున్నట్టు చెప్పారు. దీన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు భూటాన్‌ రాజు పర్యటన దోహదపడుతోందన్నారు.

అసోంలోని కోక్రాఝార్‌ నుంచి భూటాన్‌లోని గెలెపు వరకు రైల్‌ లింక్‌ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఇటీవలి కాలంలో భూటాన్‌ క్రమంగా చైనాకు దగ్గరవుతోందన్న అభిప్రాయాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాంగ్‌చుక్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ఆయన గౌరవార్థం విందు ఇచ్చారు. 

డోక్లాం.. అతి కీలకం 
వ్యూహాత్మకంగా డోక్లాం భారత్‌కు అత్యంత కీలకం. 2017లో అక్కడ భారత, చైనా సైనికులు ఏకంగా 73 రోజుల పాటు ఎదురెదురుగా మోహరించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. భూటాన్‌లో తమదిగా చెప్పుకుంటున్న ప్రాంతంలో రోడ్డు వేసేందుకు చైనా ప్రయత్నించడం ఘర్షణకు కారణమైంది. దాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. భూటాన్‌కు చైనాతో 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది.  

విపత్తుల స్పందనకు సమగ్ర వ్యవస్థ: మోదీ 
ప్రాకృతిక విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమగ్రమైన సన్నద్ధత వ్యవస్థ అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంతంలో తలెత్తే విపత్తులు దానికి సుదూరంలో ఉన్న ప్రాంతాలపై కూడా భారీ ప్రభావం చూపించే ఆస్కారముందని గుర్తు చేశారు. విపత్తుల నిర్వహణ సన్నద్ధత వ్యవస్థపై జరిగిన ఐదో అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కోవలిషన్‌ ఫర్‌ డిజాస్టర్‌ రెజీలియంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (సీడీఆర్‌ఐ)లో ఇప్పటికే 40 దేశాలు భాగస్వాములు కావడం హర్షనీయమన్నారు.

ఈ విషయమై ఒక్క తాటిపైకి వచ్చేందుకు అభివృద్ధి చెందుతున్న చిన్న, పెద్ద దేశాలకు ఈ సదస్సు చక్కని వేదికగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. విపత్తు బాధితుల్లో ప్రతి ఒక్కరినీ పూర్తిస్థాయిలో ఆదుకునేలా వ్యవస్థను అభివృద్ధి చేసుకునే దిశగా కృషి జరగాలని ప్రధాని పిలుపునిచ్చారు. విపత్తుల వేళ తక్షణ ఉపశమనంతో పాటు సాధ్యమైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొనేలా చూడటంపై దృష్టి సారించాలన్నారు. ఇందుకు రవాణా సదుపాయాలతో పాటు సామాజిక, డిజిటల్‌ సదుపాయాలు కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement