ఢిల్లీ: జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశం గర్వించదగిన సమయమని ఈ విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో "ఇది ఇస్రో (ISRO) సాధించిన మరో అద్భుతమైన విజయం, మన దేశానికి గర్వకారణమైన క్షణం. భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం 'EOS-05'ను జియోసింక్రోనస్ కక్ష్యలోకి మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే అత్యుత్తమ పనితీరు, ఆవిష్కరణలు ,సామర్థ్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇస్రో ,భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం మన అంతరిక్ష కార్యక్రమానికి కొత్త బలాన్ని, విస్తృతిని చేకూర్చడమే కాకుండా, మొత్తం అంతరిక్ష వ్యవస్థలో భారతదేశ సామర్థ్యాలను మరింత విస్తృతం చేస్తోంది. అని తన మోదీ పోస్ట్ చేశారు.
కాగా ఈ రోజు ఉదయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.రెండో ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన జీఎస్ఎల్వీ-ఎఫ్17.. సరిగ్గా 18 నిమిషాల తర్వాత 3.13 గంటలకు 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05ను సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (సబ్-జీటీఓ)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహం 170 కి.మీ. పెరీజీ, 28,934 కి.మీ. అపోజీ(భూమికి అత్యంత దూరం) ఉన్న కక్ష్యలోకి చేరింది.
దీని ప్రత్యేకతలు
ఇక ఈఓఎస్-05ను ఇస్రో సైంటిస్టులు ‘స్మార్ట్ బాయ్’ అని పిలవడానికి కారణం దాని అత్యాధునిక నిఘా సామర్థ్యాలే. భూస్థిర కక్ష్యలో ఉండి భారత ఉపఖండాన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించగల ఈ ఉపగ్రహం.. అధిక రిజల్యూషన్తో స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. మల్టీస్పెక్ట్రల్, హైపర్స్పెక్ట్రల్ కెమెరాలతో పంటలు, అడవులు, నీటి వనరులు, ఖనిజ సంపదతో పాటు వరదలు, తుపాన్లు, కార్చిచ్చుల వంటి విపత్తులను దాదాపు రియల్టైమ్లో పర్యవేక్షించగలదు. సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలపై నిఘా పెట్టడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది.


