అయోద్యలో రామమందిర ప్రారంభానికి ముందు.. హైకోర్టులో పిటిషన్‌ | Plea in Allahabad HC against Ayodhya Ram Mandir Pran Pratishtha Ceremony | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir Inauguration: అయోద్యలో రామమందిర ప్రారంభానికి ముందు.. హైకోర్టులో పిటిషన్‌

Jan 17 2024 5:19 PM | Updated on Jan 17 2024 6:55 PM

Plea in Allahabad HC against Ayodhya Ram Mandir Pran Pratishtha Ceremony - Sakshi

చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరం  ప్రారంభోత్సవానికి  సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనవరి 22న జరిగే రామ మందిరంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన భోలా దాస్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాలను తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం పుష్క మాసం నడుస్తుందని.. హిందూ క్యాలెండర్‌ ప్రకారం ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. శ్రీరాముని ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని.. నిర్మాణంలో ఉన్న ఆలయంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్టించడం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. అంతేగాక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అధికార బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆరోపించారు.
చదవండి: ఆయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి?

ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనుంది.  ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం పాల్గొంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠపై శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు. ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు’ అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

మరోవైపు  అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement