పహల్గాం దాడికి తగిన నివాళి | Pahalgam Victims Families Happy Over Operation Sindoor, See Their Reactions Inside | Sakshi
Sakshi News home page

Operation Sindoor: పహల్గాం దాడికి తగిన నివాళి

May 8 2025 6:56 AM | Updated on May 8 2025 9:00 AM

pahalgam victims families Happy Over Operation Sindoor

ఆపరేషన్‌ సిందూర్‌పై బాధిత కుటుంబాల హర్షం.. 

సాయుధ దళాలకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ నుదుటన సిందూరాన్ని తుడిపేసినవారిపై దాడితో న్యాయం జరిగిందని మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దాడులతో మరోసారి దాడి చేయాలంటే ఉగ్రవాదులు వణికిపోతారంటూ బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కొంత ఉపశమనం పొందారు. భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వాలను ప్రశంసించారు.  

మోదీని అడగండి అన్నారు.. ఆయన సమాధానం ఇచ్చారు: హిమాన్షి నర్వాల్‌  
ఆపరేషన్‌ సిందూర్‌ను పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్‌ నర్వాల్‌ భార్య హిమాన్షి నర్వాల్‌ స్వాగతించారు. ‘నా పెళ్లి జరిగి ఆరు రోజులే అయింది.. మమ్మల్ని వదిలేయండని ఉగ్రవాదులను వేడుకున్నా. కానీ ఉగ్రవాదులు మాత్రం ‘మోదీని అడగండి’ అని బదులిచ్చారు. ఈ రోజు మోదీ, మన సైన్యం వారికి సమాధానం చెప్పారు’ అని హిమాన్షి వ్యాఖ్యానించారు.

బాధితులకు సరైన నివాళి: ప్రగతి జగ్దాలే 
‘ఆపరేషన్‌ సిందూర్‌’ పహల్గాం దాడిలో మరణించిన వారికి సరైన నివాళి అని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన పుణేవాసి సంతోష్‌ జగ్దాలే భార్య ప్రగతి జగ్దాలే అభివరి్ణంచారు. ‘మా సిందూరాన్ని ఉగ్రవాదులు తుడిచిపెట్టేశారు. మన సాయుధ దళాలు పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినందుకు సంతోషిస్తున్నా. ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటుందని నాకు తెలుసు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రతీకారం తీర్చుకున్నాం..: సంగీతా గన్బోటే 
ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకున్నందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని పహల్గాం దాడిలో మరణించిన మరో పుణే వాసి కౌస్తుభ్‌ గన్బోటే భార్య సంగీతా గన్బోటే అన్నారు. ‘‘ఉగ్రదాడికి భారత్‌ ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందోనని మేమంతా ఎదురు చూశాం. ఈ రోజు ఆపరేషన్‌ సిందూర్‌తో భారత సాయుధ దళాలు పహల్గాంలో పిరికిపంద దాడికి ధీటైన సమాధానం ఇచ్చాయి’’అని తెలిపారు.  

ఇదే నిజమైన నివాళి: అషన్య ద్వివేది 
ఉగ్రవాదులు భవిష్యత్తులో అమాయకులపై ఎలాంటి దాడులకు పాల్పడకుండా ఆపరేషన్‌ సింధూర్‌ బుద్ధి చెప్పిందని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కాన్పూర్‌ వాసి శుభమ్‌ ద్వివేది భార్య అషన్య సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇదే నా భర్తకు, పహల్గాం దాడిలో మరణించిన వారికి నిజమైన నివాళి. నా భర్త ఎక్కడున్నా ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు’ అని 
ఆమె పేర్కొన్నారు.  

‘పహల్గాం’ఉగ్రవాదులను కూడా అంతమొందించాలి: జెన్నీఫర్‌ 
ఆపరేషన్‌ సిందూర్‌ బాగుందని, కానీ.. తన భర్తను చంపిన నలుగురు ఉగ్రవాదులను కూడా అంతమొందించాలని పహల్గాం దాడిలో మృతి చెందిన సుశీల్‌ నథానియేల్‌ భార్య జెన్నీఫర్‌ అన్నారు. ఒక జంతువు కూడా చేయని పనిని ఆ నలుగురూ చేశారని, వారు కూడా అదే శిక్షను పొందాలని, నలుగురూ చనిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.  

నా కుమారుడి హత్యకు ప్రతీకారం తీరింది: పోనీవాలా ఆదిల్‌ తండ్రి హైదర్‌ షా
ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడులు తన కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాయని పహల్గాం ఉగ్రదాడి సమయంలో పర్యాటకులను కాపాడుతూ ప్రాణాలు అరి్పంచిన పోనీవాలా సయ్యద్‌ ఆదిల్‌ హుస్సేన్‌ షా తండ్రి హైదర్‌ షా అన్నారు. ఇప్పుడు తనకు సంతోషంగా ఉందన్నారు. తన సోదరునితోపాటు మరో 25 మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేశారని ఆదిల్‌ సోదరుడు సయ్యద్‌ నౌషాద్‌ వ్యాఖ్యానించారు.

ప్రాణాల విలువ ఇప్పుడు తెలిసొస్తుంది: ప్రియదర్శిని ఆచార్య 
ప్రాణాల విలువేంటో ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసొస్తుందని పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశాకు చెందిన ప్రశాంత్‌ సత్పతి భార్య ప్రియదర్శని ఆచార్య అన్నారు. చర్యలు తీసుకుంటామని భర్త మృతదేహం వద్ద ఆర్మీ సిబ్బంది తనకు హామీ ఇచ్చారని, ఈరోజు అది చేసి చూపించారని సంతోషం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమికొట్టాలని, ఈ భూమ్మీద ప్రజలు స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేవారు. 

 

సరైన నిర్ణయం: మంజునాథ్‌ రావు తల్లి సుమతి 
ఆపరేషన్‌ సిందూర్‌తో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని పహల్గాంలో హత్యకు గురైన కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్‌ రావు తల్లి సుమతి అన్నారు. అమాయకులకు ఏమీ జరగకూడదని, అణచివేతకు, దౌర్జన్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టకూడదని చెప్పారు. ఎంతోమంది నుదుటి తిలకాన్ని చెరిపేసినవారిని తుదముట్టించడానికి ఆపరేషన్‌ సింధూర్‌ సరైనదని పహల్గాం దాడిలో మరణించిన బెంగళూరుకు చెందిన భరత్‌ భూషణ్‌ తండ్రి చెన్నవీరప్ప అన్నారు.  

కొంత ఉపశమనం: ఆరతి 
ఆపరేషన్‌ సిందూర్‌ బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని పహల్గాం దాడిలోమృతి చెందిన కొచి్చకి చెందిన ఎన్‌ రామచంద్రన్‌ కుమార్తె ఆరతి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను సంతృప్తిగా ఉన్నాను. నా దివంగత తండ్రి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు. విడిచిపెట్టాలంటూ మా మేనమామలు ఉగ్రవాదులను వేడుకున్నారు. కానీ వారు కనికరం చూపలేదు. వారిని కాల్చి చంపారు’అంటూ దాడి రోజును గుర్తు చేసుకున్నారు.  

ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలి: బాధిత కుటుంబాలు 
ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టేంతవరకూ దాడులు కొనసాగించాలని పహల్గాం దాడిలో మరణించిన పశి్చమబెంగాల్‌ వాసులు సమీర్‌ గుహా, బితాన్‌ అధికారి కుటుంబీకులు కోరారు. పాకిస్తాన్‌ తుడిచిపెట్టుకుపోయే వరకు ఆ దేశంపై చర్యలు కొనసాగించాలని ఉగ్రదాడిలో భర్త యతీష్‌ పర్మార్, కుమారుడు స్మిత్‌లను కోల్పోయిన గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన కాజల్‌ బెన్‌ పర్మార్‌ ప్రభుత్వాన్ని కోరారు. పాక్‌పై భారత్‌ చర్య పట్ల తనకు సంతృప్తిగా ఉందని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సూరత్‌కు చెందిన శైలేష్‌ కలతియా భార్య శీతల్‌ బెన్‌ కలతియా చెప్పారు. హిందువులు, ముస్లింల పేరుతో నా భర్తను, ఇతరులను కాల్చి చంపిన ప్రజలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం ఏం చేసినా సరేనన్న శీతల్‌బెన్‌.. ప్రభుత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement