78-Year-Old Man Enrols In Class 9 In Mizoram - Sakshi
Sakshi News home page

78 ఏళ్ల తాతకు నైన్త్‌లో అడ్మిషన్‌.. స్కూలుకు ఎలా వెళుతున్నాడంటే..

Aug 3 2023 1:10 PM | Updated on Aug 3 2023 1:34 PM

Old Man Enrols In Class 9 In Mizoram - Sakshi

మిజోరంనకు చెందిన 78 ఏళ్ల తాత భుజానికి స్కూలు బ్యాగు ధరించి, యూనిఫారం వేసుకుని క్రమం తప్పకుండా రోజూ స్కూలుకు వెళుతున్నాడు. ఇదేమీ జోక్‌ కాదు.. ముమ్మాటికీ నిజం. నార్త్‌ ఈస్ట్‌ లైవ్‌ టీవీ తెలిపిన వివరాల ప్రకారం మిజోరంలోని చమ్ఫాయి జిల్లాలోని హువాయికాన్‌ గ్రామానికి చెందిన లాల్‌రింగథర కథ ప్రతీ ఒక్కరికీ స్ఫూరిగా నిలుస్తుంది.

ప్రస్తుతం లాల్‌రింగథర హువాయికోన్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో అడ్మిషన్‌ తీసుకున్నాడు. 1945లో భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లోని ఖువాంగ్‌లెంగ్‌ గ్రామంలో జన్మించిన లాల్‌రింగథర తన తండ్రి మరణించిన కారణంగా 2వ తరగతిలోనే చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. వారి ఇంటిలో అతనొక్కడే సంతానం అయిన కారణంగా తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, కూలీనాలీ చేస్తూ జీవనం కొనసాగించాడు.  

ఉపాధి రీత్యా ఒకచోట నుంచి మరో చోటుకు ‍మారి, చివరకు 1995లో న్యూ హువాయికాన్‌ గ్రామంలో స్థిరపడ్డాడు. ఉదరపోషణ కోసం ఈ వయసులోనూ స్థానిక ప్రోస్బిటేరియన్‌ చర్చిలో గార్డుగా పనిచేస్తున్నాడు. తన ఆర్థిక పరిస్థితుల కారణంగా పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాననే బాధ అతనిని నిత్యం వెంటాడేది. అలాగే ఆంగ్లంలో నైపుణ్యం సంపాదించాలని, ఆంగ్ల భాషలోని వివిధ దరఖాస్తులను నింపాలనేది అతని లక్ష్యం. అందుకోసమే ఈ వయసులోనూ అతను పాఠశాలకు వెళుతున్నాడు. 

లాల్‌రింగథర మీడియాతో మాట్లాడుతూ ‘నాకు మిజో భాష చదవడంలోనూ, రాయడంలోనూ ఎటువంటి సమస్య లేదు. అయితే చదువుకోవాలనేది నా అభిలాష. ఆంగ్ల భాష నేర్చుకోవాలనేది నా తీరని కోరిక. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా ఆంగ్ల పదాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు నేను ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే తపనతో రోజూ స్కూలుకు వెళుతున్నాను’ అని తెలిపాడు. 

ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వన్లాల్‌కిమా మాట్లాడుతూ ‘లాల్‌రింగథర అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచాడు’ అని అన్నారు. కాగా లాల్‌రింగథర ప్రతిరోజూ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం నడిచి, స్కూలుకు చేరుకుంటాడు. 
ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్‌’.. ఆన్‌లైన్‌ గేమ్‌తో ప్రేమజంటకు రెక్కలు..

Advertisement
 
Advertisement
Advertisement