ఇంతింతై.. కాస్తంతై.. | Number of female employees in the Indian IT industry has slightly decreased | Sakshi
Sakshi News home page

ఇంతింతై.. కాస్తంతై..

Jun 16 2025 3:06 AM | Updated on Jun 16 2025 3:06 AM

Number of female employees in the Indian IT industry has slightly decreased

దేశీయ ఐటీ రంగంలో తగ్గిన అతివలు

టాప్‌–5 కంపెనీల్లో నాలుగింట తగ్గుదల

మేనేజర్‌ స్థాయిలోనూ పురుషుల కంటే తక్కువే

మగవాళ్లతో పోలిస్తే వేతనాల్లోనూ భారీ అంతరం

భారత ఐటీ పరిశ్రమలోని 5 అగ్రశ్రేణి సంస్థల్లోని మొత్తం ఉద్యోగుల్లో.. నాలుగింట మహిళా ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అదే సమయంలో మొత్తం మహిళా ఉద్యోగుల సంఖ్య మూడింట పెరిగింది. ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో మహిళల వాటా మూడింట ఒక వంతు కంటే ఎక్కువే ఉంది. కానీ సీనియర్‌ స్థాయిల్లో మాత్రం బాగా తగ్గింది. ఐటీ కంపెనీల్లో స్త్రీ, పురుష ఉద్యోగుల మధ్య వేతన అంతరం కూడా ఎక్కువగా ఉంది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

దేశీయ ఐటీ రంగంలో మహిళలు గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. మనదేశంలోని అగ్రశ్రేణి 5 కంపెనీల్లో నాలుగు సంస్థలు 2024–25లో తమ ఉద్యోగుల్లో మహిళల వాటా తగ్గినట్లు నివేదించాయి. మొత్తం మీద ఈ ఐదు కంపెనీలు 2024 మార్చి నుండి 2025 మార్చి వరకు నికరంగా 27,000 మందికిపైగా మహిళలను కొత్తగా చేర్చుకున్నట్లు వెల్లడించాయి.

విప్రో మినహా...: మహిళా సిబ్బంది వాటా 2023–24లో 35.6 శాతం నుండి 2024–25లో 35.3 శాతానికి తగ్గిందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నివేదించింది. ఇన్ఫోసిస్‌లో ఈ సంఖ్య 39.3 నుండి 39 శాతానికి వచ్చి చేరింది. హెచ్‌సీఎల్‌ టెక్‌లో మహిళా ఉద్యోగుల వాటా 29.1 నుండి 28.8 శాతానికి తగ్గింది.

క్యాలెండర్‌ ఇయర్‌ అకౌంటింగ్‌ (జనవరి–డిసెంబర్‌)ను అనుసరించే కాగ్నిజెంట్‌లో మొత్తం ఉద్యోగుల్లో మహిళా సిబ్బంది వాటా 2023లో 38.8 నుంచి 2024లో 38 శాతానికి పరిమితమైంది. విప్రో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు. ఈ సంస్థలో మహిళామణుల సంఖ్య 2023–24తో పోలిస్తే 36.6 నుండి గత ఆర్థిక సంవత్సరంలో 37.1 శాతానికి పెరిగింది.  

సీనియర్‌ స్థాయిల్లో తగ్గుతోంది..: మన సమాజంలోని లింగ అసమానతలు, సాంస్కృతిక సవాళ్ల కారణంగా మహిళా ఉద్యోగుల వాటా స్తబ్దుగా ఉందని క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ చెబుతోంది. ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో మహిళల వాటా మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్నప్పటికీ.. సీనియర్‌ స్థాయిల్లో వారి సంఖ్య బాగా తగ్గుతోందని వెల్లడించింది. సీనియర్‌ నాయకత్వం విషయంలో చాలా సంస్థలలో మహిళల నిష్పత్తి సింగిల్‌ డిజిట్‌లోనే ఉంది. 

టీసీఎస్‌లో అగ్రశ్రేణి జట్టులో మహిళలు 3.6 శాతం మాత్రమే ఉన్నారు. కాగ్నిజెంట్‌ ఈ విషయంలో 20 శాతం మార్కును దాటింది. చాలా సంస్థలు శ్రామిక శక్తిలో మహిళల వాటా విషయంలో మూడింట ఒక వంతు (33 శాతం) సంఖ్యకు కట్టుబడి ఉన్నాయి. సాంకేతిక రంగంలో సందర్భం, మార్కెట్‌ తీరు, యజమానుల విచక్షణపైనే మహిళల నియామకాలు ఉంటాయని స్టాఫింగ్‌ కంపెనీ ఎక్స్‌ఫెనో అంటోంది. 

వేతనాల్లోనూ అంతరమే..
స్త్రీ, పురుష నిష్పత్తితోపాటు ఐటీ కంపెనీల్లో వేతన అంతరం కూడా పెద్ద ఎత్తున ఉంది. టీసీఎస్‌లో బోర్డు సభ్యులు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ మినహా మహిళా ఉద్యోగుల సగటు వార్షిక జీతం 2024–25లో రూ.10.6 లక్షలు మాత్రమే. ఈ కంపెనీలో ఇదే స్థాయి ఉద్యోగాల్లో పురుషులకు ఏకంగా రూ.16.7 లక్షల వేతనం ఉంది. అలాగే ఇన్ఫోసిస్‌లో మహిళా ఉద్యోగుల సగటు వార్షిక జీతం రూ.8 లక్షలు ఉంది. పురుష సహోద్యోగులకు ఇది రూ.11 లక్షలు. 

ఇతర దిగ్గజ కంపెనీల్లో ఇలా..
యాక్సెంచర్, క్యాప్‌జెమినె వంటి గ్లోబల్‌ కంపెనీలలో మహిళా ప్రాతినిధ్యం బలంగా ఉంది. 2024లో యాక్సెంచర్‌ మొత్తం సిబ్బందిలో మహిళా సిబ్బంది వాటా 48 శాతం కావడం విశేషం. క్యాప్‌జెమినైలో మహిళా సిబ్బంది వాటా 38.8 శాతం నుండి 39.7 శాతానికి పెరిగింది. మేనేజర్‌ స్థాయి రోల్స్‌లోకి వెళ్లే అవకాశాలు పురుషుల కంటే మహిళలకు 2.1 రెట్లు తక్కువగా ఉన్నాయని క్వెస్‌ చెబుతోంది. 

కరోనా మహమ్మారి తరువాత వచ్చిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం మహిళా ఉద్యోగులకు లాభిస్తుందని భావించినప్పటికీ.. అది ఆశించిన ఫలితాలు అందించలేదని నిపుణులు అంటున్నారు. ఇంటి నుంచే పని వల్ల ఇంటి పని భారం మరింత పెరిగిందని.. దానివల్ల వృత్తి, ఉద్యోగాలపై శ్రద్ధ పెట్టడం చాలామందికి కష్టమైందని చెబుతున్నారు. 

టాప్‌–5 కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 

Advertisement
 
Advertisement
Advertisement