నేడు నీట్‌ మాక్‌డ్రిల్‌  | National Testing Agency to conduct nationwide mock drill on 21 june 2026 | Sakshi
Sakshi News home page

నేడు నీట్‌ మాక్‌డ్రిల్‌ 

Jun 20 2026 5:06 AM | Updated on Jun 20 2026 5:06 AM

National Testing Agency to conduct nationwide mock drill on 21 june 2026

రేపటి నీట్‌ రీ–ఎగ్జామ్‌ నేపథ్యంలో ఎన్‌టీఏ ఏర్పాట్లు 

న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్‌ రీ–ఎగ్జామ్‌ నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నేడు దేశ వ్యాప్త మాక్‌డ్రిల్‌ చేపట్టనుంది. ఈ పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఈ కసరత్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాల తరలింపు మొదలుకొని బందోబస్తు దాకా ఏర్పాట్లను ఈ మాక్‌డ్రిల్‌లో భాగంగా సరిచూసుకుంటారు. 

ఆదివారం జరిగే ఎగ్జామ్‌ కోసం ప్రశ్నపత్రాలను జిల్లాల యంత్రాంగాలు, పోలీసుల సాయంతో బందోబస్తు నడుమ పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం రీ–ఎగ్జామ్‌ పెన్‌ అండ్‌ పేపర్‌ మోడ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 551 నగరాలతోపాటు, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. మొత్తం 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని పేర్కొంది. 

దివ్యాంగులైన అభ్యర్థులకు 6.20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని వివరించింది. అభ్యర్థులు 11 నుంచి 1.30 గంటల మధ్యలో కేంద్రానికి చేరుకోవాలని, కచ్చితంగా 1.30 గంటలకు అధికారులు గేట్లు మూసివేస్తారని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోపలికి అనుమతించబోరని పేర్కొంది. పరీక్ష కోసం పోలీసులు, జిల్లా యంత్రాంగం కలిపి దేశవ్యాప్తంగా 2 లక్ష మంది సేవలను వినియోగించుకుంటున్నామంది. 

అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సెంట్రలైజ్డ్‌ కంట్రోల్‌ రూంలతో అనుసంధానమై ఉండే సీసీటీవీ నిఘా, ఒకరికి బదులుగా మరొకరు రాసేందుకు అవకాశం లేకుండా ఆధార్‌ బేస్డ్‌ బయోమెట్రిక్‌ ధ్రువీకరణ, పరీక్ష కేంద్రాల ప్రవేశద్వారాల వద్ద హై సెన్సిటివిటీ మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేశామని వివరించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై ఓ కన్నేసి ఉంచామని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 

సాంకేతిక సమస్యల కారణంగా బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ పూర్తికాని పక్షంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోని సూపరింటెండెంట్‌ వద్ద ఉండే ఫార్మాట్‌లో స్వయం ధ్రువీకరణ పత్రంపై సంతకం చేస్తే సరిపోతుందని కూడా ఎన్‌టీఏ తెలిపింది. వేసవి పరిస్థితులు కొనసాగుతున్నందున పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు, ఇతర సౌకర్యాలు కల్పించామని తెలిపింది. 
 
వైద్య విద్యార్థులకు సెలవు ఇవ్వకండి 
నీట్‌ రీ–ఎగ్జామ్‌ నేపథ్యంలో వైద్య విద్యార్థులకు ఈ నెల 20, 21వ తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవు మంజూరు చేయవద్దని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ అన్ని వైద్య కళాశాలలు, సంస్థలను ఆదేశించింది. నీట్‌ పరీక్షల్లో వైద్య విద్యార్థులు జోక్యం చేసుకున్నట్లు గతంలో అనేక పర్యాయాలు వెల్లడైన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం నోటీస్‌ జారీ చేసింది. 

అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోండి 
జూన్‌ 21న జరగబోయే నీట్‌ రీ–ఎగ్జామినేషన్‌కు సంబంధించి అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని రిమైండర్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ఈమెయిల్‌లు, వాట్సాప్‌ నోటిఫికేషన్‌లను పంపుతున్నట్లు ఎన్‌టీఏ శుక్రవారం తెలిపింది. అదే సమయంలో, మోసపూరిత సందేశాలు, నకిలీ సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించింది. ఎస్‌ఎంఎస్‌లు Nఐఇ్కఉ్క అనే ఐడీ ద్వారా nౌట్ఛp y.n్ఛ్ఛ్ట.n్ట్చఃnజీఛి.జీn. ద్వారా మెయిళ్లను పంపుతామంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement