కాన్సెర్ట్‌లో ఘోరం: డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి | Music Concert 28 Year-Old Man Collapses and Dies | Sakshi
Sakshi News home page

కాన్సెర్ట్‌లో ఘోరం: డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి

Jun 7 2026 11:48 AM | Updated on Jun 7 2026 11:48 AM

Music Concert 28 Year-Old Man Collapses and Dies

ముంబై: మహానగరం ముంబై వర్లీలోని ప్రసిద్ధ ‘ఎన్‌ఎస్‌సీఐ డోమ్‌’లో జరిగిన ఓ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ ఊహించని విషాదంతో ముగిసింది. వేలాది మంది సంగీతాభిమానుల కోలాహలం మధ్య, ఓ 28 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ముంబైలోని మాహిమ్ ప్రాంతానికి చెందిన వృషభ్ మహేంద్ర గాంగుర్డే (28)గా పోలీసులు గుర్తించారు. తన స్నేహితులతో కలిసి ఈ కాన్సెర్ట్‌కు హాజరైన వృషభ్, వేలాది మంది గుమిగూడిన వేదిక వద్ద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు.

ప్రాథమిక సమాచారం ప్రకారం విపరీతమైన రద్దీ కారణంగా వృషభ్‌తో పాటు అతనితో ఉన్న ఒక యువతి కూడా తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. స్పృహతప్పిన వృషభ్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ, అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ  ఘటనపై తార్దేవ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వృషభ్ ఆరోగ్య పరిస్థితి విషమించడానికి ముందు అతను మద్యం సేవించి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నప్పటికీ, ఏదైనా ఇతర పదార్థాల ప్రభావం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

పోస్ట్‌మార్టం నివేదిక, ఇతర వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే యువకుని మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటన ముంబైలో భారీ స్థాయిలో జరిగే కాన్సెర్ట్‌ల భద్రతా ఏర్పాట్లపై చర్చకు తెరలేపింది. ఎన్‌ఎస్‌సీఐ క్లబ్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. అంత భారీ సంఖ్యలో జనం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, అక్కడి వాతావరణం అంతా గందరగోళంగా మారిందని ఆరోపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement