భారతీయ కంపెనీలపై ఆరోగ్య మంత్రి ప్రశంసలు

MInister Says 2 Indian Companies In Clinical Trial Phase Covid 19 Vaccine - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా నిరోధక వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారతీయ కంపెనీలు, శాస్త్రవేత్తలు ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. భారత్‌కు చెందిన రెండు కంపెనీలు క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. కరోనా ఉపశమన చర్యలకై కంపెనీలు, శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు, ప్రయోగ దశ ఫలితాలకు సంబంధించిన వివరాలతో కూడిన.. ‘‘సీఎస్‌ఐఆర్‌(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) టెక్నాలజీస్‌ ఫర్‌ కోవిడ్‌-19 మిటిగేషన్‌’’ కంపెడియం(సారాంశపట్టిక)ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌-19పై పోరులో అలుపెరుగక కృషి​ చేస్తున్న వైద్య నిపుణులపై ప్రశంసలు కురిపించారు. దాదాపు 150 దేశాలకు యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయడంలో పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయన్నారు. కోవిడ్‌-19 అభివృద్ధిలో రెండు భారతీయ కంపెనీలు ముందంజలో ఉండటం గొప్ప విషయమన్నారు.కాగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ ఇప్పటికే ‘కోవాక్సిన్‌’ మానవ పరీక్షలు ప్రారంభించగా‌, పుణే కేంద్రంగా పనిచేసే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. (కరోనా : భారత్‌లో మరో రికార్డు )

ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16 లక్షలకు చేరువగా ఉన్న నేపథ్యంలో.. రికవరీ రేటు ఊరట కలిగించే విషయమని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మందికి పైగా పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. మిగతా పేషెంట్లు కూడా త్వరలోనే కోలుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా తక్కువగా ఉండటం సానుకూల అంశమని తెలిపారు. కాగా గత 24 గంటల్లో దేశంలో (బుధవారం నుంచి గురువారం ఉదయం 9గంటల వరకు) 52,123 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా... 775 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top