మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు | Maoist Top Leader As‍hanna Surrender | Sakshi
Sakshi News home page

మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు

Oct 16 2025 6:11 PM | Updated on Oct 16 2025 7:59 PM

Maoist Top Leader As‍hanna Surrender

బీజాపూర్‌: మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్నారని హోంమంత్రి అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. 

కాగా, మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ అభయ్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట బుధవారం(అక్టోబర్‌ 15) లొంగిపోగా... అదే బాటలో మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న సైతం ఇవాళ లొంగిపోయారు. నిన్న (బుధవారం) ఛత్తీస్‌గఢ్‌లోని వేర్వేరు జిల్లాల్లో మొత్తం 78 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో 27 మంది లొంగిపోగా, ఇందులో పది మంది మహిళా మావోలు ఉన్నారు. కాంకేర్‌ జిల్లాలో 32 మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తంగా 50 మంది అజ్ఞాతం వీడారు.

ఇందులో మావోయిస్టు పార్టీలో కీలకమైన దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీకి చెందిన రాజమన్‌ మండావి అలియాస్‌ రాజ్‌మోహన్, రాజు సలామ్‌ అలియాస్‌ శివప్రసాద్‌ కూడా ఉన్నారు. 50 మంది మావోయిస్టుల బృందాన్ని ప్రత్యేక బస్సులో కాంకేర్‌ తరలించి అక్కడ లొంగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ 7 ఏకే 47లతో పాటు మరో 17 ఇతర ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇక కొండగావ్‌ జిల్లాలో మరో మహిళా మావోయిస్టు లొంగిపోయింది.

శాంతిచర్చలపై ముందుగా అభయ్‌ పేరుతో మల్లోజుల వేణుగోపాల్‌ రాసిన లేఖ మార్చి 28న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నార్త్‌ వెస్ట్‌ సబ్‌జోనల్‌ బ్యూరో ఇన్‌చార్జిగా రూపేశ్‌ అలియాస్‌ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ నుంచి వరుసగా మూడు లేఖలు విడుదలయ్యాయి. అంతేకాక ఒక యూట్యూబర్‌కు వీడియో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అన్ని లేఖల్లోనూ ‘శాంతి చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొందాం. తుపాకీ కంటే చర్చల ద్వారానే సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుంది’అనే అభిప్రాయాన్నే ఆశన్న వ్యక్తంచేశారు. దీంతో మల్లోజుల, ఆశన్న ఒకేదారిలో ఉన్నారనే అభిప్రాయం ఏర్పడింది. అందుకు తగ్గట్టే మల్లోజుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే ఆశన్న సైతం లొంగిపోవడం గమనార్హం.

తక్కెళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట. హæన్మకొండలో పాలిటెక్నిక్‌ చదువుతూ రాడికల్‌ ఉద్యమాల వైపు ఆకర్షితుడై 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ (పీడబ్ల్యూజీ) చేపట్టిన పలు కీలక యాక్షన్లలో సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ చౌరస్తాలో 1999 సెపె్టంబర్‌ 4న ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌చంద్రను దారికాచి కాల్చి చంపిన ఘటన, ఆ తర్వాత 2000 మార్చి 7న అప్పటి ఉమ్మడి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్‌కేసర్‌ దగ్గర బాంబు పేల్చి చంపిన టీమ్‌లోనూ ఆశన్న ఉన్నారు. అంతేకాక 2003 అక్టోబర్‌లో తిరుపతి సమీపంలోని అలిపిరి దగ్గర సీఎం నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని క్లెమోర్‌ మైన్స్‌ పేల్చిన తొమ్మిది మంది సభ్యుల బృందానికి ఆశన్నే నాయకత్వం వహించారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement