top leader
-
Nambala: నంబాల మృతదేహాన్ని అప్పగించరా?
సాక్షి, ఛత్తీస్ఘడ్: మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారా?. కావాలనే మృత దేహం అప్పగింతకు జాప్యం చేస్తున్నారా?. అసలు మృతదేహాన్ని అప్పగిస్తారా? లేదా?. ఆయన కుటుంబ సభ్యులు కోర్టు ఆర్డర్తో వెళ్లినా కూడా పోలీసులు తాత్సారం చేస్తుండడంపై ఇప్పుడు విమర్శలు వినవస్తున్నాయి.ఛత్తీస్ఘడ్(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఈనెల 21 న జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు తో పాటు మరో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే..ఆయన మృతదేహాన్ని(Nambala Dead Body) అప్పగించాలని ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. అయినా కూడా మృతదేహాల అప్పగింత విషయంలో ఛత్తీస్ఘడ్ పోలీసులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కేవలం ఆ రాష్ట్రానికి చెందిన మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించడం గమనార్హం.మరోవైపు.. కేశవరావు కుటుంబ సభ్యులను పోలీసులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. తమ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, కోర్టు ఆర్డర్ ఉన్నా అక్కడి పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగి ఆరు రోజులు కావడం.. మృత దేహం కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నందున సత్వరమే నంబాల మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఛత్తీస్ఘడ్ పోలీసులు(Chhattisgarh Police) ఇదే రీతిలో వ్యవహరిస్తే ఆందోళన చేపతామని హెచ్చరిస్తున్నారు.నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో.. మృతదేహాన్ని ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజును కడసారి చూపు చూసేందుకు లేకుండా చేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్య నేత హతం
జెరూసలెం:లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్బొల్లాకు వరుసగా రెండో ఎదురుదెబ్బ తగిలింది.ఇజ్రాయెల్ ఆదివారం(సెప్టెంబర్29) జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా మరో ముఖ్యనేత నబిల్కౌక్ మరణించాడు.తమ రాకెట్ దాడుల్లో హెజ్బొల్లా డిప్యూటీ హెడ్ నబిల్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.ఇజ్రాయెల్ సైన్యం ప్రకటనపై హెజ్బొల్లా ఇప్పటివరకు స్పందించలేదు.తాజాగా శుక్రవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా (64) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి కోలుకోకముందే హెజ్బొల్లా మరో కీలక నేతను కోల్పోయింది.నబిల్ 1995 నుంచి 2010 వరకు సౌత్ లెబనాన్లోని హెజ్బొల్లా మిలటరీ కమాండర్గా పనిచేశాడు.నబిల్పై 2020లో అమెరికా ఆంక్షలు విధించింది. ఇదీచదవండి: బంకర్బాంబు దాడిలో నస్రల్లా మృతి -
అడ్వాణీకి భారతరత్న
న్యూఢిల్లీ: రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ అగ్ర నేత లాల్కృష్ణ అడ్వాణీ (96)కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం 1990లో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అడ్వాణీని, రామాలయ ప్రారం¿ోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం. అడ్వాణీకి ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు. ‘‘సమకాలీన రాజకీయవేత్తల్లో అత్యంత గౌరవనీయుడు అడ్వాణీ. దేశాభివృద్ధిలో ఆయనది అత్యంత కీలక పాత్ర. అచంచలమైన చిత్తశుద్ధి, అంకితభావంతో దేశానికి దశాబ్దాల పాటు సేవ చేశారు. ప్రజాస్వామ్యానికి జాతీయవాద విలువలను కూర్చిన గొప్ప నాయకుడు. అత్యంత కింది స్థాయి నుంచి మొదలై ఉప ప్రధానిగా ఎదిగారు. రాజకీయాల్లో నైతిక విలువలకు నూతన ప్రమాణాలు నెలకొల్పారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘ఇది నాకెంతో భావోద్వేగపూరిత క్షణం. అడ్వాణీతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఎంతగానో నేర్చుకునే అవకాశం నాకు దక్కింది’’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రకటన అనంతరం అడ్వాణీకి మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తనకు అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల అడ్వాణీ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశం కోసమే నా జీవితమంతా ధారపోశా. నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది. నాకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అద్వానీతో కలిపి ఇప్పటిదాకా 50 మందికి ఈ పురస్కారం దక్కింది. పది రోజుల క్రితమే బిహార్ దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సామాజికవేత్త కర్పూరి ఠాకూర్కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి ఈ పురస్కారం ఇవ్వవచ్చు. కానీ 1999లో మాత్రం నలుగురికి భారతరత్న ప్రకటించారు. కుటుంబ రాజకీయాలను సవాలు చేసిన అడ్వాణీ: మోదీ సంభాల్పూర్ (ఒడిశా): అడ్వాణీ ఆజన్మాంతం కుటుంబ రాజకీయాలను సవాలు చేశారని, దేశ ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ కోసం పోరాడారని మోదీ అన్నారు. బీజేపీపై అంటరాని పార్టీ ముద్రను పోగొట్టి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజకీయ వేదికగా తీర్చిదిద్దారని కొనియాడారు. ‘‘దివంగత ప్రధాని వాజ్పేయితోకలిసి భారత ప్రజాస్వామ్యానికి అడ్వాణీ జాతీయ విలువలద్దారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక కుటుంబ గుత్తాధిపత్యం నుంచి విముక్తం చేసేందుకు నిరంతరం పోరాడారు. ఆయనకు భారతరత్న లభించడం బీజేపీకి, దాని అసంఖ్యా కార్యకర్తలకు కూడా గొప్ప గౌరవం’’ అని ఒడిశాలోని సంభాల్పూర్ ర్యాలీలో మోదీ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, అనురాగ్ ఠాకూర్ తదితరులతో పాటు పలు పారీ్టల నాయకులు కూడా అడ్వాణీకి అభినందనలు తెలిపారు. దేశానికి, బీజేపీకి, పార్టీ సిద్ధాంతానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలను వరి్ణంచేందుకు మాటలు చాలవని షా అన్నారు. తన గురువైన అద్వానీకి ఇంతటి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపానన్నారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి, ఎల్జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు అడ్వాణీకి అభినందనలు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయం కొలువుదీరిందంటే అందుకు అడ్వాణీయే కారణమని బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. త్వరలో దిగిపోనున్న మోదీ సర్కారు బీజేపీ ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే అడ్వానీకి భారతరత్న ప్రకటించిందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. నేను ఆచరించిన విలువలకు, నా సేవలకు గుర్తింపు ‘‘భారతరత్న పురస్కారం నాకు అత్యున్నత గౌరవం మాత్రమే కాదు. నేను జీవితాంతం ఆచరించిన విలువలకు, శక్తివంచన లేకుండా అందించిన సేవలకు గుర్తింపు కూడా. దీన్ని అత్యంత వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నా. 14 ఏళ్ల వయసులో కార్యకర్తగా ఆరెస్సెస్లో చేరిన రోజు నుంచి భరతమాతకు నిస్వార్థంగా సేవ చేయడమే లక్ష్యంగా బతికా. ఈ జీవితం నాది కాదు, దేశానిదేనన్న భావనే నన్ను ముందుకు నడిపింది. ఈ సందర్భంగా పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయిలను కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నా. ఈ ఇద్దరు మహనీయులతో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. సుదీర్ఘ ప్రజా జీవితంలో నాతో పాటు కలిసి పని చేసిన లక్షలాది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తదితరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు భారతరత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నాకు అడుగడుగునా అంతులేని ప్రేరణ శక్తిగా నిలిచిన నా కుటుంబీకులను, ముఖ్యంగా నన్ను వీడి వెళ్లిన నా భార్య కమలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నా దేశం మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ – భారతరత్న ప్రకటన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో అడ్వాణీ. -
డ్రోన్ దాడిలో అల్ ఖైదా కీలక నేత హతం: అమెరికా
డమస్కస్: సిరియాలో అమెరికా జరిపిన దాడుల్లో అల్ ఖైదా అగ్రనేత హతమయ్యాడు. నార్త్ వెస్ట్రన్ సిరియాలోని స్థావరంపై అమెరికా డ్రోన్ల సాయంతో ఈ దాడులు చేపట్టింది. ఈ దాడిలో అల్-ఖైదా సీనియర్ నాయకుడు, అబ్దుల్ హమీద్ అల్ మాతర్ మరణించినట్లు సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్బీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడిలో సాధారణ పౌరులు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎమ్క్యూ-9 విమానం ఉపయోగించి దీనిని నిర్వహించామని ఆయన చెప్పారు. తాజాగా జరిపిన దాడిలో అల్ఖైదాలోని కీలక నేతను హతమార్చడంతో ఉగ్రవాద సంస్థలు ప్రపంచంపై జరిపే దాడులను నివారిస్తుందని ఆయన అన్నారు. సెప్టంబర్ చివరిలో అల్ ఖైదా నేత అబు అహ్మద్ యూఎస్ సైన్యం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అబు అహ్మద్ నిధుల సమీకరణ, దాడులకు ప్రణాళికలు రచించడం, ఎక్కడికక్కడ అల్ ఖైదా దాడులకు అనుమతులు ఇవ్వడం తదితర బాధ్యతలను నిర్వర్తించేవాడు. దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్పోస్ట్పై ఉగ్రవాదులు దాడిచేసిన రెండు రోజుల తర్వాత ఈ డ్రోన్ దాడి జరగడం విశేషం. అయితే ప్రతికారంగానే ఈ దాడి జరిగిందా అనే విషయాన్ని అమెరికా ధృవీకరించలేదు. చదవండి: Russia Orders: ఆ వారం రోజులు ఆఫీసులకు వెళ్లకండి.. అయినా జీతాలిస్తాం! -
ఐఎస్ అగ్రనేత హఫీజ్ హతం
కాబుల్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు మరో కోలుకోలేని దెబ్బతగిలింది. ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ముఖ్యనాయకుడిగా కొనసాగుతున్న హఫీజ్ సయీద్ ను శనివారం అమెరికా వైమానిక దళాలు హతమార్చాయి. పాక్ సరిహద్దులోని నంగార్హర్ ప్రావిన్స్ లో తలదాచుకున్న ఐఎస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం డ్రోన్లతో మెరుపుదాడి జరిపింది. ఈ ఘటనలో హఫీజ్ సహా మరో 30 మంది తీవ్రవాదులు మరణించినట్లు తెలసింది. ఆఫ్ఘనిస్థాన్ డైరెక్లరేట్ ఆఫ్ సెక్యూరిటీ, ఆఫ్ఘన్ స్పై ఏజెన్సీ సంస్థలు హఫీజ్ మరణాన్ని దృవీకరించాయి. -
ఓటమిపై వామపక్షాల సమీక్ష
సీపీఎం పొలిట్బ్యూరో, సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గం వేర్వేరు భేటీలు న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో వామపక్షాల దారుణ పరాజయంపై సీపీఎం, సీపీఐ అగ్ర నాయకత్వాలు ఆదివారం ఢిల్లీలో తమ తమ కార్యాలయాల్లో సమావేశమై ప్రాథమికంగా సమీక్షించుకున్నాయి. ఎన్నికల్లో తమ తమ పార్టీలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోగా మరింతగా దిగజారటానికి గల కారణాలు, తమ తమ పార్టీల్లో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పుచేర్పులు, ఎన్నికల అనంతర రాజకీయ పరిస్థితులు, బీజేపీ భారీ విజయంతో జరగనున్న పరిణామాలు, ఆ క్రమంలో తమ పాత్ర తదితర అంశాలపై అగ్రనేతలు చర్చించుకున్నారు. సీపీఎం పొలిట్బ్యూరో భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్తోపాటు అగ్ర నేతలు సీతారాం ఏచూరి, బిమన్బసు, పినరయి విజయన్, బృందాకారత్, తదితరులు పాల్గొన్నారు. జూన్ 7, 8 తేదీల్లో పార్టీ కేంద్ర కమిటీ సమావేశమై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను, నివేదికను ఆమోదించనుంది. మరోవైపు సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గం సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఎ.బి.బర్ధన్, ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, జాతీయ కార్యదర్శి డి.రాజా తదితరులు పాల్గొన్నారు. జూన్లో పార్టీ జాతీయ మండలి సమావేశమై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తుందని రాజా తెలిపారు.