ఈసీ తీరు అనుమానాస్పదం | Many parties are outraged by Central Election Commission behavior | Sakshi
Sakshi News home page

ఈసీ తీరు అనుమానాస్పదం

Apr 16 2025 1:31 AM | Updated on Apr 16 2025 1:34 AM

Many parties are outraged by Central Election Commission behavior

ఓటర్ల డేటా ఎందుకివ్వరు? 

మండిపడ్డ పార్టీలు, సంస్థలు 

ఈసీ ప్రతినిధులతో సమావేశం 

ఈవీఎంలపై అన్నీ అనుమానాలే  

ట్యాంపరింగ్‌ జరుగుతున్నట్టు ఆరోపణలు.. పోలింగ్‌శాతాల్లోనూ అనూహ్య తేడాలు 

రాత్రికల్లా భారీగా పెరుగుతున్నాయి 

ఈసీ విశ్వసనీయతకే పెనుసవాలు 

ఏ ప్రశ్నకూ భేటీలో బదుల్లేదు:  సీనియర్‌ అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ 

సుప్రీంకోర్టుకు నివేదిస్తామని వెల్లడి  

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి డిమాండ్‌ చేస్తుండటం తెలిసిందే. 

ఈ విషయమై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌)తో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్‌–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ఆహ్వానం మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్‌ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు.  

సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్‌ 
సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 

2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్‌సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్‌ భూషణ్‌ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. 

‘‘ఓటింగ్‌ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్‌ జరుగుతోందని దేశవ్యాప్తంగా చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్‌ దుయ్యబట్టారు. 

2024లోనూ అవకతవకలు: మొయిత్రా 
2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో్లనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్‌ శాతాలు రాత్రికల్లా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. 

ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది’’ అని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement