కేఐఏడీబీకి భూమిని తిరిగిచ్చేసిన రాహుల్‌ ఖర్గే | Mallikarjun Kharge son withdraws Bengaluru land allotment request amid nepotism charges | Sakshi
Sakshi News home page

కేఐఏడీబీకి భూమిని తిరిగిచ్చేసిన రాహుల్‌ ఖర్గే

Oct 14 2024 6:00 AM | Updated on Oct 14 2024 6:00 AM

Mallikarjun Kharge son withdraws Bengaluru land allotment request amid nepotism charges

బెంగళూరు/శివాజీనగర: కర్ణాటకలో ముడా స్కాం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు రాహుల్‌ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌ ‘మల్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌’ఏర్పాటుకు బెంగళూరులో ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలనే అభ్యర్థనను ఉపసంహరించుకున్నారు. 

ఈ మేరకు సెప్టెంబర్‌ 20న కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధి బోర్డు (కేఐఏడీబీ)కు రాసిన లేఖలో రాహుల్‌ ఖర్గే పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎమర్జింగ్‌ టెక్నాలజీలో మరిన్ని ఉద్యోగావకాశాలు కలి్పంచడమే సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌ లక్ష్యమన్నారు. కళాశాల విద్యను అభ్యసించలేని విద్యార్థులకు సహాయం చేయడానికి కూడా దీనిని రూపొందించామని పేర్కొన్నా రు. పరిశ్రమలకు దగ్గరగా ఉండటం వల్ల యువతకు అవకాశాలు పెరుగుతాయనే కేఐఏడీబీ ఇండ్రస్టియల్‌ ఏరియాను ఎంచుకున్నామని లేఖలో స్పష్టం చేశారు.

 

 ఆ లేఖ కాపీలను కర్ణాటక మంత్రిగా ఉన్న మల్లికార్జున ఖర్గే చిన్న కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే తన ‘ఎక్స్‌’హ్యాండిల్‌లో పంచుకున్నారు. సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థలన్నీ లాభాపేక్ష లేని సంస్థలేనని, సీఏ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, పొందడానికి ట్రస్టుకు పూర్తి అర్హత ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే.. దురుద్దేశంతో కూడి న, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను నిరంతరం ఎదుర్కొంటూ ఏ విద్యాసంస్థా సమర్థవంతంగా పనిచేయదని, సామాజిక సేవే లక్ష్యంగా నడుస్తు న్న ట్రస్టును వివాదాల్లోకి నెట్టడం ఇష్టం లేకే ప్రతి పాదనను ఉపసంహరించుకుంటున్నట్లు కేఐఏడీబీకి ట్రస్టు లేఖ రాసిందని మంత్రి తెలిపారు.  

ఇటీవల అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన తనయుడు రాహుల్‌ ఖర్గేలకు చెందిన సిద్ధార్థ విహార్‌ ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల భూమిని మంజూరు చేసింది. కాగా, సిద్ధార్థ విహార్‌ ట్రస్టుకు భూమి కేటాయించడాన్ని బీజేపీ ఐటీ విభాగం ఇంచార్జ్‌ అమిత్‌ మాలవీయ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లహర్‌సింగ్‌ సిరోయాలు ఎక్స్‌లో వేదికగా ప్రశ్నించారు. ఇది కచ్చితంగా అధికార దురి్వనియోగం, బంధుప్రీతితో వ్యవహరించడమేనని పేర్కొన్నారు. కేఐఏడీబీ భూమి పొందడానికి ఖర్గే కుటుంబ సభ్యులు ఏరోస్పేస్‌ పారిశ్రామిక వేత్తలుగా ఎప్పడు మారారని ఎద్దేవా చేశారు. ముడా ప్లాట్ల కేటాయింపుల విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో 14 సైట్లను మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి ఆమె తిరిగి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement