
ముంబై: మహారాష్ట ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై వెనక్కు తగ్గింది. త్రిభాషా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి చేసే ప్రభుత్వ ప్రయత్నాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శించిన దరిమిలా తాజా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమలుపై ఒక కమిటీ సమగ్రంగా చర్చించనున్నదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ ‘పాఠశాలల్లో వివిధ భాషలను ఏ ప్రమాణాల ప్రకారం అమలు చేయాలి? విద్యార్థులకు ఏ ఎంపికలు ఇవ్వాలి? అనేది నిర్ణయించేందుకు విద్యావేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఏప్రిల్ 16, జూన్ 17న జారీ చేసిన రెండు ప్రభుత్వ తీర్మానాలను రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించారు.
ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో ఒక ప్రకటనలో ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా వెల్లడించింది. దీనిపై శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఎన్సీపీ (ఎస్పీ)ల ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం మరాఠీపై దృష్టి సారిస్తుందని ప్రకటించారు. అలాగే ఇంగ్లీషును అంగీకరించిన ఉద్ధవ్ థక్రే తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో త్రిభాషా విధానం అమలుపై ఒక కమిటీని ఏర్పాటు చేయాన్న డాక్టర్ రఘునాథ్ మషేల్కర్ కమిటీ సిఫార్సులను ఉద్ధవ్ థాక్రే అంగీకరించారని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ హిందీ భాష నేర్చుకోవాలని కోరుకున్నారని సీఎం ఫడ్నవీస్ అన్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు