
నేడు మకర సంక్రాంతి సందర్భంగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనం పోటెత్తారు. ఈరోజు చేసే స్నానాన్ని అమృత స్నాన్ అని అంటారు. దీనిని ఆచరించేందుకు సంగమం ఒడ్డున భక్తులు బారులు తీరారు. ఉదయం 8.30 గంటల కల్లా కోటి మందికి పైగా జనం త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.
మకర సంక్రాంతి(Makar Sankranti) సందర్భంగా అఖాడా వర్గానికి చెందిన సాధువులు అమృత స్నానాన్ని ఆచరిస్తున్నారు. పంచాయితీ అఖాడా మహానిర్వాణి, శంభు పంచాయితీ అటల్ అఖాడా మొదట అమృత స్నానం ఆచరించారు. అమృత స్నాన సమయంలో 13 అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఇది ముగిసిన అనంతరం సామాన్యులు స్నానం ఆచరిస్తున్నారు. అమృత స్నాన్ మహా కుంభమేళాలో ప్రధానమైనదిగా పరిగణిస్తారు. ఇందులో స్నానం చేసేందుకు మొదటి అవకాశం నాగ సాధువులకు ఇస్తారు.
పురాణాల్లోని వివరాల ప్రకారం సముద్ర మథనం నుండి వెలువడిన అమృత భాండాగారాన్ని దక్కించుకునేందుకు దేవతలు, రాక్షసులు ఒకరితో ఒకరు పోరాడుతున్నప్పుడు నాలుగు అమృత బిందువులు నాలుగు ప్రదేశాలలో (ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్,నాసిక్) పడ్డాయి. నాటి నుంచి ఈ ప్రాంతాల్లో మహా కుంభమేళా(Great Kumbh Mela) ప్రారంభమైంది. నాగ సాధువులను మహాశివుని అనుచరులుగా పరిగణిస్తారు. అందుకే వారిని ముందుగా ఈ స్నానం ఆచరించడానికి అర్హులుగా భావిస్తారు. ఈ నేపధ్యంలోనే వారికి తొలుత స్నానం ఆచరించేందుకు అవకాశం కల్పిస్తారు.
ఇది కూడా చదవండి: రూ. 25 లక్షల చైనీస్ మాంజా స్వాధీనం.. బుల్డోజర్తో ధ్వంసం