సాక్షి,కోల్కతా: ఈ రోజు శుక్రవారం ఉదయం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.141 మంది ప్రయాణికులతో టేకాఫ్కు సిద్ధంగా ఉన్న విమానంపై అకస్మాత్తుగా పిడుగుపడింది. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే భద్రతా సిబ్బంది తక్షణమే స్పందింది ప్రయాణికులను వేరే విమానంలో తరలించారు.
కోల్కతాలో ఈ రోజు ఉదయం భారీ ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం నుంచి అగర్తలా వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E6068) టేకాఫ్ కోసం పార్కింగ్ స్థలంలో సిద్ధంగా ఉంది . అయితే ఆ సమయంలోనే హఠాత్తుగా విమానంపై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా విమానంలో పవర్ ఆఫ్ కావడంతో అక్కడే ఉన్న విమాన సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ విమానం నుంచి దించివేసి, వేరొక విమానంలో వారిని గమ్యస్థానానికి తరలించారు.
అయితే ఈ ప్రమాద సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది స్వల్పంగా ప్రభావితం కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.
పిడుగులతో విమానానికి ఏం కాదా?
సాధారణంగా విమానంపై పిడుగు పడినా వాటికి ఎటువంటి ప్రమాదం సంభవించదు. విమానాలు పిడుగుపాటును తట్టుకునేలా అత్యంత సురక్షితమైన సాంకేతికతతో డిజైన్ చేయబడి ఉంటాయి. సాధారణంగా విమానాల పైభాగం వాహక లోహంతో ఒక 'ఫారెడే కేజ్' లా పనిచేస్తుంది. దీనివల్ల పిడుగు ద్వారా వచ్చిన విద్యుత్ విమానం వెలుపలి ఉపరితలం గుండా ప్రవహించి గాల్లోకి వెళ్లిపోతుంది. దీంతో వాటికి ఎటువంటి ప్రమాదం సంభవించదు.


