5 కోట్లకు ప్రధానిని హత్య చేస్తానన్న వ్యక్తి అరెస్ట్
పుదుచ్చేరి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు తాను సిద్ధమని, ఎవరైనా రూ.5 కోట్లు ఇస్తే ఆ పని చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటించిన వ్యక్తి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. పుదుచ్చేరిలోని అర్యణ్కుప్పం గ్రామానికి చెందిన సత్యానందం (43) రియల్ ఎస్టేట్ వ్యాపారి. తాను అడిగినంత నగదు ఇస్తే మోదీని చంపేందుకు సిద్ధమని ఫేస్బుక్లో ప్రకటన చేయడంతో కలకలం ఏర్పడింది. అతడిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఓ ట్యాక్సీ డ్రైవర్ సహాయంతో శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల ఫేస్బుక్లో సత్యానందం.. ‘ఎవరైనా రూ.5 కోట్లు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపుతా’ అని సంచలన ప్రకటన చేశాడు. ఆ పోస్ట్ను చూసిన ఓ ట్యాక్సి డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ‘సత్య సత్య’ అనే ఫేస్బుక్ ఖాతాను పోలీసులు ట్రేస్ చేశారు. చివరకు అతడు పుదుచ్చేరికి సమీపంలో ఉన్న సత్యానందం అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రజల మధ్య అల్లర్లు సృష్టించడం, శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలపై ఐపీసీ సెక్షన్లు 505 (1), 505 (2) కింద సత్యానందంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరిచారు.