
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ గైర్హాజరుల పర్వం ఢిల్లీ జలమండలి కేసులోనూ పునరావృతమైంది. మద్యం అవకతవకల కేసులో కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు సమన్లు జారీచేయడం ఆయన గైర్హాజరవడం తెల్సిందే. తాజాగా ఢిల్లీ జల్బోర్డ్లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ విచారణ కోసం సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సమన్లు జారీచేయగా కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్కు రాలేదు.
తనకు సమన్లు పంపడం చట్టవ్యతిరేకమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ సంబంధించిన సమన్లు అందుకున్న రెండో కేసు ఇది. మద్యం ఎక్సయిజ్ కేసులో ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు అందుకోవడం, ప్రతిసారీ ఆఫీస్కు రాకుండా మిన్నకుండిపోవడం తెల్సిందే. మద్యం కేసులో విచారణ నిమిత్తం మార్చి 21వ తేదీన తమ ఆఫీస్కు రావాలని ఈడీ తాజాగా ఆయనకు తొమ్మిదోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం.