Karnataka Results Mallikarjun Kharge Thanks Voters for Support - Sakshi
Sakshi News home page

ఇది ప్రజావిజయం.. మోదీ గుజరాత్‌ బిడ్డయితే.. కన్నడ బిడ్డను నేను!

Published Sat, May 13 2023 9:00 PM

Karnataka Results Mallikarjun Kharge thanks voters for support - Sakshi

సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఘనవిజయంతో కాంగ్రెస్‌ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి.  సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత తనదేనని అన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గే. శనివారం సాయంత్రం కేపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 

సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కింది. కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. కర్ణాటక గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది. కన్నడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత నాది. తొలి కేబినెట్‌లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కర్ణాటక మాదిరిగానే ఇతర స్టేట్స్‌లోనూ కాంగ్రెస్‌ను గెలిపిస్తాం అని అన్నారాయన. 

నేను గుజరాత్‌ బిడ్డనని మోదీ పదే పదే చెప్తుంటారు. మోదీ గుజరాత్‌ బిడ్డయితే నేను కన్నడ బిడ్డను.. రైతు బిడ్డను. మోదీ సహా కేంద్రమంత్రులంతా వచ్చి కర్ణాటకలో ప్రచారం చేసినా.. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని, అందుకు కృతజ్ఞతలని ఖర్గే పేర్కొన్నారు. 


సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 
కాంగ్రెస్‌ గ్యారెంటీ స్కీంపై మా కేబినెట్‌ తొలి సంతకం చేస్తుంది. దేశాన్ని బీజేపీ అప్పుల పాలు జేసింది. మోదీ పదిసార్లు రోడ్‌షోలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. కర్ణాటక గెలుపు దేశానికి ఓ సందేశం. 2024 కూడా ఇదే విజయాన్ని సాధిస్తాం. 


రణదీప్‌ సుర్జేవాలా మాట్లాడుతూ.. 
కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కర్ణాటక ప్రజలందరిదీ. కాంగ్రెస్‌ను గెలిపించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర కలిసొచ్చింది. కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేసిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. 


డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. 
కర్ణాటకకు పట్టిన గ్రహణం వీడింది. డీకే శివకుమార్‌, సిద్ధరామయ్యదే విజయం కాదు. ఇది కర్ణాటక ప్రజల విజయం. రేపు(ఆదివారం) సాయంత్రం సీఎల్పీ సమావేశం ఉంటుంది అని తెలిపారు. 

Advertisement
Advertisement