కర్ణాటకలో క్రాస్‌ ఓటింగ్.. కాంగ్రెస్ ఘన విజయం | karnataka legislative council polls congress wins five amid cross voting | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో క్రాస్‌ ఓటింగ్.. కాంగ్రెస్ ఘన విజయం

Jun 19 2026 5:26 PM | Updated on Jun 19 2026 6:00 PM

karnataka legislative council polls congress wins five amid cross voting

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎ‍న్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి 135 మంది సభ్యుల బలం ఉండగా ఏకంగా 151 ఓట్లను సాధించి, 5 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకోగా, జేడీఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీఎస్ (JD-S) పార్టీలకు చెందిన 12 మంది వరకు ఎమ్మెల్యేలు తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేడీఎస్‌ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సమాచారం. ఆ పార్టీకి అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే జేడీఎస్ అభ్యర్థికి 18ఓట్లు రావాలి. కానీ, జేడీఎస్ మొదటి ప్రాధాన్యతా ఓట్లు 14 మాత్రమే వచ్చాయి. 

అంటే, నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సమాచారం. బీజేపీ కనీసం మూడు ఓట్లను కోల్పోగా కాంగ్రెస్‌కు అదనంగా వచ్చిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే గందరగోళం ఏర్పడింది. దీనిపై విచారణ సాగుతుంది.ఈ క్రాస్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ అఖండ విజయం సాధించగా, ప్రతిపక్ష శిబిరంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ, జేడీఎస్‌ కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడంపై ఆయా పార్టీల అగ్రనాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరిపి, బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని బిజెపి నేతలు ప్రకటించారు. 

కాగా సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందులో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఈ గెలుపుపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement