Omicron: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Karnataka Issues Fresh Covid Norms after Omicron cases - Sakshi

రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుని ఉంటేనే థియేటర్లు, మాల్స్‌కు అనుమతి 

అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్‌ పరీక్షలు 

మార్గదర్శకాలను విడుదల చేసిన సర్కార్‌ 

నిపుణులతో సీఎం బొమ్మై సమావేశం 

మెడికల్‌ కళాశాల డైరెక్టర్లతో మంత్రి సుధాకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Karnataka Omicron Restrictions: ఒమిక్రాన్‌ వైరస్‌ జాడలు రాష్ట్రంలో బయటపడటంతో ఆ మహమ్మారిని నిలువరించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు మంత్రి సుధాకర్‌ శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆరోగ్యసౌధ నుంచి  21 మెడికల్‌ కళాశాల డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా మాట్లాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రెండు కేసులు బయటపడ్డాయి. ఐదు పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపామని తెలిపారు. కేసులు పెరిగితే పీజీ విద్యార్థులను వైద్య సేవలకు వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో నర్సింగ్‌ సంఖ్య పెంచేందుకు తీర్మానించినట్లు తెలిపారు. పారామెడికల్‌ కోర్సు చదివే 18 వేల మంది సేవలను కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఐసీయూ ఏర్పాట్లు, పరికరాల కొనుగోలుపై చర్చించినట్లు తెలిపారు.  

శుక్రవారం మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశంలో  పాల్గొన్న సీఎం బసవరాజబొమ్మై 

సీఎం బొమ్మై నేతృత్వంలో నిపుణులతో సమావేశం    
ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో నూతన మార్గదర్శకాలు విడుదల చేసే విషయంపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కృష్ణాలో ఆరోగ్య శాఖ మంత్రి క్టర్‌ కే.సుధాకర్, మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, సీనియర్‌ అధికారి మంజునాథ్‌ ప్రసాద్, బీబీఎంపీ అధికారులు, నిపుణులతో సమావేశం అయ్యారు. డిసెంబర్‌ 10న విధానపరిషత్‌ ఎన్నికలు, 13 నుంచి బెళగావి శాసనసభా సమావేశాలు ఉన్నందున ఒమిక్రాన్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రోజూ లక్ష మందికి కోవిడ్‌ పరీక్షలు జరపాలని, ఆక్సిజన్, ఐసీయూ పడకల ఏర్పాటు, ఔషధాల సమస్య పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.  

చదవండి: (హైదరాబాద్‌లో ఒమిక్రాన్‌ కలవరం.. వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిక)

మార్గదర్శకాలు ఇవే 
►సినిమా హాల్, మాల్స్‌కు వెళ్లేందుకు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ తప్పనిసరి  
►తల్లిదండ్రులు రెండు డోస్‌ల టీకాలు తీసుకుంటునే వారి పిల్లలను పాఠశాలల్లోకి అనుమతి 
►పాఠశాల, కాలేజీల్లో సభలు, సమావేశాలకు బ్రేక్‌   
► వివాహాది కార్యాలకు 500 మందికి మాత్రమే అనుమతి

413 కరోనా కేసులు 
సాక్షి, బెంగళూరు: గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 413 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 256 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నాలుగు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,97,246కు పెరిగింది. 29,52,101 మంది కోలుకున్నారు. మరణాలు 38,220కి చేరాయి. 6,896 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top