నేడు ఢిల్లీకి సీఎంలు సిద్ధరామయ్య, పినరయి విజయన్.. కేంద్రం తీరుకు నిరసన! | Karnataka Congress Chalo Delhi Protest At Jantar Mantar | Sakshi
Sakshi News home page

Chalo Delhi: నేడు ఢిల్లీకి సీఎంలు సిద్ధరామయ్య, పినరయి విజయన్.. కేంద్రం తీరుకు నిరసన!

Feb 7 2024 7:14 AM | Updated on Feb 7 2024 9:21 AM

Karnataka Congress Chalo Delhi Jantar Mantar Protest - Sakshi

కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌, కేరళలోని అధికార ఎల్‌డీఎఫ్‌ పార్టీలు కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆందోళనకు నడుం బిగించాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నేడు (బుధవారం) ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక దౌర్జన్యాలకు, అన్యాయానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ బృందం దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు ప్లాన్ చేసింది. చలో ఢిల్లీ పిలుపులో భాగంగా సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ అగ్రనేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. 

ఈరోజు (బుధవారం) కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వ అన్యాయ, వివక్షాపూరిత విధానాల వల్ల 2017-18 నుంచి కర్ణాటక ప్రభుత్వానికి రూ.1.87 లక్షల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నేటి ఉదయం 7 ఉదయం 11 గంటల నుండి జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టనుంది. 

గ్రాంట్లు ఇవ్వడంలో కర్ణాటకపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సౌకర్యాల కల్పనలో కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు అన్యాయం చేసిందని సీఎం ఆరోపించారు. ‘మేరా ట్యాక్స్ మేరా అధికార్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఈ నిరసనను ఉధృతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. 

తమ నిరసన భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) వ్యతిరేకం కాదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఐక్యంగా ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తోందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటామన్నారు. కరోనా  సంక్షోభ సమయంలో కూడా తమకు సరైన ఉపశమనం లభించలేదని కర్ణాటక ప్రభుత్వం ఆరోపిస్తోంది. 

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా అందలేదని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా దేశ రాజధానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు కేరళ ప్రభుత్వం కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగింది.

Advertisement
 
Advertisement
Advertisement