హిందువులందరికీ ఎంతో ప్రత్యేకమైన అమర్నాథ్ యాత్ర షెడ్యుల్ను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. జులై 3 నుంచి ప్రారంభమై 57 రోజుల పాటు యాత్ర సాగనున్నట్లు తెలిపింది. ఆగస్టు 28 రక్షా బంధనం పర్వదినం రోజున యాత్ర ముగుస్తుంది.
2026కు సంబంధించి అమర్నాథ్ యాత్ర వివరాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు. జులై 3న యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జూన్ 29న జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా పరమేశ్వరునికి ప్రథమ పూజ నిర్వహించనున్నారు. ఈ యాత్రకోసం ఏప్రిల్ 15 నుంచి రిజిష్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. దీనికి భక్తులు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్దతులలో రిజిష్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అమర్నాథ్ గుహలో పరమేశ్వరుడు మంచు లింగం రూపంలో దర్శనమిస్తాడు. ఇది ప్రకృతి సహజంగా ఏర్పడుతుంది. చంద్రుని కళలకు అనుగుణంగా ఈ లింగం పరిమాణం పెరగడం, తగ్గడం ఇక్కడి గొప్ప విశేషం. సౌత్ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ గుహలో ఏర్పడుతుంది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని శివుని స్వరూపంగా భక్తులు విశ్వసిస్తుంటారు.
ఎన్నోరకాల సవాళ్లు, వ్యయప్రయాసాలను తట్టుకుని , తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ భక్తుల అమర్ నాథ్ యాత్రను నిర్వహిస్తారు. 70 ఏళ్ల పై బడిన వారిని అమర్ నాథ్ యాత్రకు అనుమతించరు. భక్తులు రెండు మార్గాల ద్వారా ఈ యాత్రను పూర్తి చేసుకోవచ్చు. ఒకటి పహల్గామ్ మార్గం కాగా, మరొకటి బల్తాల్ మార్గం. పహల్గామ్ మార్గంలో 34 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. ఈ రెండు మార్గాల నుంచి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.


