లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ఆమెకు నివాళులర్పించారు. "భారతదేశం ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రసిద్ధ, బహుముఖ స్వరాలలో ఒకటైన ఆశా భోంస్లే గారి మరణం పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసింది, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను తాకింది." అని రాసుకొచ్చారు.
ఆశా భోంస్లే రాగాలైనా, స్వరకల్పనలైనా, ఆమె స్వరంలో కాలాతీతమైన ప్రకాశం ఉండేది. ఆమెతో తనకు కలిగిన అనుభవాలను నేను ఎప్పటికీ మదిలో పదిలపరుచుకుంటాను అని మోదీ అన్నారు. ఆమె సేవలు తరతరాలకు స్పూర్తినిస్తునే ఉంటారని ఆశా భోంస్లే పాటలు ఎప్పటికీ ప్రజల మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆమె కుటుంబంతో పాటు అభిమానులకు సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
కాగా క్వీన్ ఆఫ్ వెర్సటాలిటీ ఆశా భోంస్లే ఏప్రిల్ 11 నిన్న శనివారం ఛాతీ ఇన్ఫెక్షన్ సమస్యతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం చికిత్సపొందుతూ మృతిచెందారు. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోంస్లే తన ఎనిమిది దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్లో దాదాపుగా 20 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ పాటలు పాడారు. దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.


