లెజండరి సింగర్ ఆశా భోస్లే (92) ఏప్రిల్ 11, శనివారం నాడు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, తాజాగా ఆమె మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియాలో స్పందించారు. ఆశా భోస్లే అనారోగ్యంతో ఉన్నారనే విషయాన్ని ఆమె ధృవీకరిస్తూ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమకు గోప్యత కల్పించాలని కోరారు.
ఈ క్రమంలో ఆమె ఇలా రాశారు. "మా అమ్మమ్మ, ఆశా భోస్లే(Asha Bhosle) తీవ్రమైన అలసటతో ఉన్నారు. ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. దయచేసి మా గోప్యతకు విలువ ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాము. చికిత్స కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందిస్తాము. ఎలాంటి ప్రచారం చేయకండి" అని ఆమె కోరారు.
తన కాలంలోని అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరైన ఆశా భోస్లే, 1943లో వచ్చిన 'మాఝా బాల్' అనే మరాఠీ నాటకంతో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత 1948లో వచ్చిన 'చునరియా' చిత్రంలోని 'సావన్ ఆయా' పాటతో బాలీవుడ్లోకి ప్రవేశించారు.
ఆమె సుమారు 20 భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడారు. 2006లో ఆమె స్వయంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, దాదాపు 12,000 పాటలను రికార్డ్ చేశారు. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'ఇన్ ఆంఖోం కి మస్తీ కే', 'రంగీలా రే', 'రాధా కైసే నా జలే', 'షరారా షరారా' వంటి చిరస్మరణీయ గీతాలకు ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మవిభూషణ్ వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు.


