శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరూక్ అబ్దుల్లాని హత్యచేయడం కోసం 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపారు.
నిన్న( బుధవారం) జమ్మూలోని గ్రేటర్ కైలాష్ వద్ద ఫరూక్ అబ్దుల్లా ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతున్నారు. అప్పుడు హఠాత్తుగా ఒక వ్యక్తి వెనక నుండి వచ్చి ఆయనను కాల్చే యత్నం చేశాడు. వెంటనే ఇది గమనించిన ఎన్ఎస్జీ కమాండోలో అతనిని చెయ్యిని లాగడంతో ప్రమాదం తప్పింది. అయితే నిందితుడు 65ఏళ్ల కమల్సింగ్ అని అతను జమ్మూకు చెందిన పురాణాస్ మండీ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు.
మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను చంపడానికి గత 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నానని విచారణలో కమల్ సింగ్ తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఒమర్ అబ్దుల్లా స్పందించారు. 'Z ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న 85 ఏళ్ల వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. అల్లా దయతో ఉన్నారు. అయితే లోడెడ్ పిస్తోల్తో ఆ వ్యక్తి పాయింట్ బ్లాక్ రేంజ్లోకి ఎలా రాగలిగాడు. అతని పక్కకు ఉన్న సెక్యూరిటీ మాత్రమే అతనిని కాపాడగలిగింది. ఇందులో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి' అని అన్నారు.
అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫరూక్ అబ్దుల్లా వెంబడి జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, ముఖ్యమంత్రి సలహాదారు నాసిర్ సోగామి ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.



