
ఒడిశాలోని పూరీలో జరిగే రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న (సోమవారం) ఉదయం మంగళ హారతితో రథయాత్ర ప్రారంభమైంది. జై జగన్నాథ్ అంటూ భక్తులు నినాదాలు చేస్తుండగా రథయాత్ర మొదలయ్యింది.
భక్తులు రెట్టించిన ఉత్సాహంతో రథాల తాళ్లను ముందుకు లాగారు. డప్పుల దరువులుల మధ్య బలభద్రుడి రథంతో జగన్నాథుడు తన అత్త అయిన గుండిచా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి జగన్నాథుని సోదరి దేవి సుభద్ర ఆశీనురాలైన రథం కూడా గుండిచా ఆలయానికి చేరుకుంది. నేటి (మంగళవారం) తెల్లవారుజాము వరకు రథాలపైనే ఆశీనులై పూజలు అందుకున్న జగన్నాథుడు, సుభద్రలు గుండిచా ఆలయంలోకి ప్రవేశించనున్నారు.
53 ఏళ్ల తర్వాత ఈసారి పూరీలో రథయాత్ర రెండు రోజుల పాటు జరుగుతోంది. కాగా ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో రథయాత్ర సందర్భంగా శ్యామ్ సుందర్ కిషన్ (45) అనే భక్తుడు రథం చక్రాల కింద పడి మృతి చెందాడు. ఆదివారం కుకుజుంఘా గ్రామంలో జగన్నాథ రథాన్ని లాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఆదివారం పూరీలో జరిగిన రథయాత్రలో కొంతమంది పోలీసులతో సహా 130 మంది గాయపడ్డారు, వారిలో సగం మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ కాగా, 40 మందికి చికిత్స కొనసాగుతోంది.