India: Government Dropped Abide With Me Hymn From Beating Retreat, Details Inside - Sakshi
Sakshi News home page

India: బీటింగ్‌ రిట్రీట్‌లో గాంధీకి ఇష్టమైన పాట తొలగింపు.. ఎందుకంటే?

Published Mon, Jan 24 2022 10:07 AM

Indian Government Dropped Abide With Me Hymn From Beating Retreat - Sakshi

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఈ నెల 29న నిర్వహించే బీటింగ్‌ రిట్రీట్‌లో ఈసారి గాంధీజీకి ఇష్టమైన ‘అబిడ్‌ విత్‌ మీ’ పాటని తొలగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఈ ఏడాది దేశీ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. '

ఈ పాట స్థానంలో ప్రముఖ దేశభక్తి గీతం ‘ఏ మేరే వతన్‌ కే లోగో’ను వాయించనున్నారు. 1962 ఇండో–చైనా యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ కవి ప్రదీప్‌ ఈ గీతాన్ని రాశారు. దేశ భద్రత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ ఈ గీతాన్ని ఆలపిస్తారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్‌ రిట్రీట్‌ను నిర్వహిస్తారు.    
(చదవండి: పొలిటికల్‌ ప్లేయర్‌: ప్రత్యర్థులతో ఫుట్‌బాల్‌ ఆడేయగలరు)



2020లోనే తొలగించాలనుకున్నా.. 
‘అబిడ్‌ విత్‌ మీ’ని 1847లో స్కాటిష్‌ ఆంగ్లికన్‌ కవి హెన్రీ ఫాన్రిస్‌ లైట్‌ రాశారు. 1950 నుంచి బీటింగ్‌ రిట్రీట్‌ వేడుకలో దీన్ని వాయిస్తున్నారు. తాజాగా దీన్ని విరమిస్తున్నట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. 2020లోనూ అబిడ్‌ విత్‌ మీ పాటను తొలగిం చాలని అనుకున్నా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. తాజాగా అబిడ్‌ విత్‌ మీని బీటింగ్‌ రిట్రీట్‌ వేడుక నుంచి తొలగించడంపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.

వారసత్వాన్ని తుడిచేసే పనిలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడింది.  వలస పాలనను గుర్తు చేసే పాట కన్నా దేశీయులకు బాగా తెలిసిన పాటను చేర్చడం మేలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏ మేరే వతన్‌ లోగోతో పాటు 26 పాటనలు భారతీయ ఆర్మీ రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో వాయించనుంది.
(చదవండి: తన పేరు మార్పుపై సీఎం స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు)

Advertisement
Advertisement