9 ఏళ్ల చిన్నారి.. రెండు జన్మల కథ! | Funday Special Story On The Famous Shanti Devi Past Life Story | Sakshi
Sakshi News home page

9 ఏళ్ల చిన్నారి.. రెండు జన్మల కథ!

Aug 2 2026 12:27 PM | Updated on Aug 2 2026 12:59 PM

Funday Special Story On The Famous Shanti Devi Past Life Story

శాంతిదేవి (చిన్నప్పటి ఫొటో మధ్యలో), శాంతిదేవి

మిస్టిక్‌ వరల్డ్‌

సూర్యుడు నడినెత్తి మీదకు వస్తున్నాడు. మధుర పట్టణంలోని ద్వారకాధీశ్‌ ఆలయ పరిసరాల్లో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల శాంతిదేవి కళ్లలో ఒక విచిత్రమైన శూన్యం, అంతకంటే వింతైన వెలుగు కనిపిస్తున్నాయి.

ఆమె ఆ ఊరికి రావడం ఇదే మొదటిసారి. కానీ, ఆమె అడుగులు మాత్రం వడివడిగా ముందుకు పడుతున్నాయి. ఆమెతోపాటు ఉన్న 15 మంది ప్రముఖులు ఒకింత ఆశ్చర్యం, మరికొంత ఉత్కంఠతో వెనకే వెళ్తున్నారు. ఆ బాలిక ఓ ఇంటి ముందు ఆగి, ‘ఇదే నా ఇల్లు..’ అని చెప్పి తలుపు తట్టింది. లోపలి నుంచి వచ్చిన వ్యక్తిని చూసి.. ‘ఏవండీ ఎలా ఉన్నారు’ అని అడిగేసరికి వారంతా నిర్ఘాంతపోయారు.

1926 డిసెంబరు 11న ఢిల్లీలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది శాంతిదేవి. నాలుగేళ్ల వయసు వచ్చే వరకు అందరిలాగా ఆటపాటలతో గడిపింది. కానీ, మాటలు స్పష్టంగా వస్తున్న కొద్దీ ఆమె ప్రవర్తనలో మార్పు రాసాగింది. అద్దం ముందు నిలబడి.. ‘ఇది నేను కాదు, నా ముఖం ఇలా ఉండదు’ అని విచారంగా అనుకునేది.

మొదట్లో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె చెప్పే మాటలు వారిని భయాందోళనలకు గురిచేశాయి. ‘నా పేరు శాంతిదేవి కాదు, నేను లుగ్దీదేవిని. మధుర నా సొంతూరు. నాకు పెళ్లయింది. నా భర్త పేరు కేదార్‌నాథ్‌ చౌబే. ఒక బాబుకు జన్మనిచ్చిన తొమ్మిది రోజులకే నేను కన్నుమూశాను’ అంటూ ఏడ్చేది. ఈ విషయం శాంతిదేవి చదువుకునే స్కూలు టీచరుకు తెలియడంతో ఆయనకు ఆసక్తి కలిగి ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కేదార్‌నాథ్‌కు లేఖ రాశారు.

ఆశ్చర్యం.. అక్కడ నుంచి జవాబు వచ్చింది. తన పేరు కేదార్‌నాథ్‌ చౌబే అని, లుగ్దీదేవి తన భార్యే అని, ఆమె 1925లో చనిపోయిందని చెప్పడంతో ఆ టీచరుకు నోటమాట రాలేదు. వెంటనే కేదార్‌నాథ్‌కు విషయాలన్నీ వివరించి ఢిల్లీ రావాలని కోరారు. ఈ విషయాలేవీ శాంతిదేవికి చెప్పకుండా కేదార్‌నాథ్‌ను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లారు. ఆయన్ను చూసిన శాంతిదేవి– ఎంతో ఉద్విగ్నతకు లోనై, ‘ఏవండీ..’ అంటూ పిలిచేసరికి కేదార్‌నాథ్‌  బిత్తరపోయారు. ఎందుకంటే తనను అలా పిలిచే ఏకైక వ్యక్తి ఆయన భార్య మాత్రమే. కానీ ఆమె మరణించిన పదేళ్ల తర్వాత ఓ చిన్నారి అలా పిలిచేసరికి ఆయన షాక్‌లో ఉండిపోయారు. తమ ఇద్దరికీ మాత్రమే తెలిసిన ఎన్నో వ్యక్తిగత విషయాలను శాంతిదేవి ప్రస్తావించడంతో ఆమె గత జన్మలో తన భార్యే అని కేదార్‌నాథ్‌ నిర్ధారణకు వచ్చారు.

ఈ వార్త మహాత్మా గాంధీ వరకు చేరింది. దీంతో 1935లో శాంతిదేవిని, ఆమె తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. చిన్నారి చెప్తున్న విషయాల్లోని నిజాయతీని గమనించిన ఆయన.. లోతైన విచారణ కోసం 15 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

కమిటీ సభ్యులు శాంతిదేవిని తీసుకొని 1935 నవంబరులో ఢిల్లీ నుంచి మధురకు రైలులో బయలుదేరారు. ఢిల్లీ దాటి ఎప్పుడూ వెళ్ళని ఆ బాలిక మధుర స్టేషన్‌ రాగానే స్థానిక ‘బ్రజ్‌’ యాసలో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టింది. స్టేష¯Œ లో దిగగానే, గత జన్మలో తన భర్తకు పెద్దన్నయ్య అయిన వ్యక్తిని గుర్తుపట్టింది. అక్కడి నుంచి తన పాత ఇంటికి వారందరినీ తీసుకువెళ్లింది.

ఒక గదిలో నేల కింద తాను దాచిన డబ్బు గురించి చెప్పింది. అయితే అక్కడ తవ్వగా ఖాళీ డబ్బా మాత్రమే దొరికింది. కమిటీ సభ్యులు శాంతిదేవి వైపు అనుమానంగా చూశారు. ఆ క్షణంలో కేదార్‌నాథ్‌ కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘ఆ డబ్బు లుగ్దీదేవి చనిపోయాక నేనే తీశాను’ అని అంగీకరించడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అలాగే తమ కుమారుడి చిన్నప్పటి గుర్తులు కూడా చెప్పి అందరినీ విస్తుపోయేలా చేసింది.

శాంతిదేవి చెప్పిన చాలా అంశాలు వందకు వంద శాతం సరిపోయాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పలువురు పారానార్మల్‌ పరిశోధకులు కూడా శాంతిదేవి కేసును పునర్జన్మలకు సంబంధించిన బలమైన ఉదాహరణగా ప్రస్తావించారు. అయితే, దీనిపై శాస్త్రీయంగా ఏకాభిప్రాయం రాలేదు. కొందరు దీనిని పునర్జన్మకు ఆధారంగా పేర్కొన్నారు. మరికొందరు మెదడులోని పాత జ్ఞాపకాల పొరలని వాదించారు.

ఓవైపు ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు.. మరోవైపు గత జన్మ తాలూకు జ్ఞాపకాలు.. ఇలా జీవితాంతం రెండు జన్మల మధ్య బతికిన శాంతిదేవి వివాహం చేసుకోకుండా తన 61వ ఏట 1987లో మరణించారు.

- కె.సత్యకిశోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement